కుభీర్, ఏప్రిల్ 28 : కరోనా మహమ్మారితో దేశమంతా వణికిపోతున్న తరుణంలో నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పల్సితండా ఒక్క కేసు లేకుండా ఔరా అనిపిస్తున్నది. నిత్యం వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. ఈ గ్రామం కొవిడ్ రక్కసికి చిక్కలేదు. కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలుచేస్తూ ఏడాది కాలంగా శుభకార్యాలకు దూరంగా ఉండటంతోపాటు మంచి ఆహార నియమాలు గ్రామస్థులను కరోనా నుంచి కాపాడుతున్నాయి. గతేడాది నుంచి కరోనా మహమ్మారితో పల్లె నుంచి పట్నందాకా ముప్పుతిప్పలు పడుతున్న సమయంలో ఈ గ్రామం ఒక్క కేసు లేకుండా సురక్షితంగా ఉండటం విశేషం.
స్వచ్ఛ గాలి.. ఆహారపు అలవాట్లు
చుట్టూ గుట్టలు, పచ్చని అడవులు ఉన్న పల్సితండాలో 150 కుటుంబాలు, 680 మంది జనాభా ఉన్నారు. ఉదయం 4 గంటలకే మహిళలు, పురుషులు వ్యవసాయ పనులకు వెళ్లి.. 10 గంటలకు తిరిగొస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చెట్ల కింద సేదతీరి మళ్లీ పనులకు వెళ్తారు. ఉదయం చాయ్కు బదులు డికాషన్ తీసుకుంటారు. టిఫిన్ సమయంలో వేడివేడి జొన్న అంబలి తాగుతారు. ఆకు కూరలు, దుంపలు, పప్పు దినుసులు, చింతపూత, ఇప్పపువ్వు ఆహారంగా తీసుకుంటారు. అడవిలో దొరికే సీజనల్ పండ్లు తింటారు. అడవిలో లభించే పోషకాలతో కూడిన పండ్లు తీసుకుంటారు. గ్రామంలో వందకుపైగా ఉన్న వేప చెట్ల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం, పుష్టికరమైన భోజనం తీసుకోవడం వల్లనే తమ గ్రామానికి కరోనా రాలేదని గ్రామస్థులు చెబుతుండటం గమనార్హం.
నిత్యం శానిటైజేషన్..
కరోనాను ఎదుర్కొవాలంటే కఠినమైన నిబంధనలు పాటించాలని గ్రామస్థులు భావించారు. అందరూ ఏకమై గ్రామంలో నిత్యం శానిటైజేషన్ చేసేలా తీర్మానం చేసుకున్నారు. ఈ మేరకు పంచాయతీ సిబ్బంది ప్రతి వీధిలో శానిటైజేషన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరిస్తున్నారు. సామగ్రి తెచ్చుకునేందుకు పది కుటుంబాల తరఫున ఒక్కరే వెళ్తున్నారు. యేడాది కాలంగా గ్రామస్థులు శుభకార్యాలకు దూరంగా ఉండటం విశేషం. ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా ఉండటం వల్ల కరోనా సోకకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పక్కాగా నిబంధనల అమలు
ప్రభుత్వం సూచించినట్టు గ్రామస్థులు కొవిడ్ నిబంధనలను పక్కాగా పాటిస్తున్నారు. యేడాది కాలంగా పెండ్లిళ్లు, పేరంటాలకూ దూరంగా ఉంటున్నారు. దీంతోపాటు గరంగరం గంజి, జొన్న అంబలి తాగుతుండటం.. చాయ్కి బదులు డికాషన్ తీసుకోవడం కరోనా నుంచి రక్షిస్తుంది. గ్రామంలో పెంచిన వేప చెట్ల కిందే యేడాది కాలమంతా తండా ప్రజలు నిద్రిస్తారు. ఎన్నో రోగాలను ఈ చెట్ల గాలి హరిం చేస్తదని మా నమ్మకం.
ఇవీ కూడా చదవండి…
వైరస్ చైన్ ను బ్రేక్ చేయడమే విరుగుడు : ఎయిమ్స్ చీఫ్