న్యూఢిల్లీ : కరోనా వైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందే క్రమాన్ని నివారించడంలో ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో భాగస్వాములు కావాలని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా విజ్ఞప్తి చేశారు. వైరస్ చైన్ ను బ్రేక్ చేయడమే మన ముందున్న కర్తవ్యమని చెప్పారు. స్వల్ప కొవిడ్ లక్షణాలతో బాధపడేవారు హోం ఐసోలేషన్ తో బయటపడవచ్చని శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
ఇక కరోనా మహమ్మారి పట్ల భయాందోళనలు వీడాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కోరారు. కొవిడ్-19 రోగులు వారి కుటుంబ సభ్యుల మధ్య ఆడియో, వీడియో కాల్స్ సదుపాయం ఏర్పాటు చేసేలా ఆస్పత్రులు చొరవ తీసుకోవాలని సూచించారు. కరోనా పట్ల భయం ముసురుకునే వాతావరణం తొలగించే చర్యలు అవసరమని అన్నారు. మరోవైపు కరోనా వైరస్ తమను ఏమీ చేయదని మొండిగా వ్యవహరించం తగదని స్పష్టం చేశారు.