బీర్కూర్, జూన్ 11: ఉమ్మడి పాలనలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీటి కోసం నిజాంసాగర్ కట్టపై కూర్చొని ఏడ్చినా ఫలితం దక్కలేదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నాడు చంద్రబాబు వద్దకు వెళ్లి నీళ్లకోసం అడిగితే హైదరాబాద్కు తాగునీరెట్లా అంటూ గద్దించేవారని గుర్తుచేశారు. కానీ, స్వరాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అడగకుండానే సింగూరు నీటిని వదిలి నిజాంసాగర్ నింపిన మహానుభావుడు అని కొనియాడారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్లో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో శనివారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు కాంగ్రెస్ హయాంలో పింఛన్ల కోసం 28 లక్షల మందికి కేవలం 800 కోట్లు మాత్రమే ఇచ్చేవారని, ఇప్పుడు 40 లక్షల మందికి రూ.12 వేల కోట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని. మన పక్క రాష్ర్టాల్లో ఆరు గంటల కరెంటుకే దిక్కులేదన్న విషయాన్ని గమనించాలని కోరారు. ఏపీలో పోయిన వర్షాకాలం కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులను ఇప్పటికీ ఇవ్వలేదని అన్నారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడతామంటే ఊరుకోబోమని కేంద్రాన్ని హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు దానిని జరగనివ్వనని దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పారు. పల్లె ప్రగతి పనులతో గ్రామాలు మెరిసిపోతున్నాయని స్పష్టంచేశారు. పనీపాటా లేని కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం మొండి వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెంటనే స్పందించాలని అన్నారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులను వెంటనే వచ్చేలా కృషి చేయాలని డిమాండ్చేశారు. దశాబ్దాల ప్రతిపక్ష పార్టీల పాలనలో లేని ప్రగతి టీఆర్ఎస్ ఏడేండ్లలో చేసి చూపించిందని స్పష్టంచేశారు. 24 గంటల ఉచిత కరెంటు, ఇంటింటికీ తాగునీరు, కాళేశ్వరం సాగునీరే ఇందుకు సాక్ష్యమని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 10 ఉత్తమ గ్రామ పంచాయతీలు తెలంగాణకు చెందినవి కావడం గర్వకారణమన్నారు.
పల్లెప్రగతిలో స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం: ఎమ్మెల్సీ కవిత
పల్లె ప్రగతిలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం హర్షణీయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తన విజ్ఞప్తి మేరకు ఈ విషయంలో చొరవ తీసుకున్న మంత్రులు ఎర్రబెల్లికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకొన్నట్టే గ్రామాన్నీ శుభ్రంగా ఉంచాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతిని చేపట్టారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నెలనెలా ఠంఛన్గా నిధులను అందజేసి అభివృద్ధి చేస్తున్న మహా నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. క్రీడా ప్రాంగణాలకు రూ.4 లక్షలు సరిపోవడం లేదని, మరికొన్ని నిధులు కేటాయించాలని కోరారు. గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణానికి కూడా నిధులు కేటాయించాలని విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న కేంద్రం ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.