హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): పల్లె ప్రగతి కార్యక్రమంతోనే రాష్ట్రంలోని పల్లెలు కేంద్ర అవార్డులను దక్కించుకొంటున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పంచాయతీలన్నీ పల్లె ప్రగతికి ముందు, పల్లె ప్రగతికి తర్వాత అనేలా తయారయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. నాలుగో విడత పల్లెప్రగతిలో.. ఇప్పటి వరకు నాటిన మొక్కలు బతికేలా, వైకుంఠధామాలను వినియోగించుకొనేలా చూస్తామని, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా మన పల్లెల్లో మార్పు వచ్చిందని అన్నారు.
శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడిన ఆయన.. గ్రామాల్లో పది శాతం గ్రీనరీ నిధులతో పెద్దఎత్తున మొక్కలు నాటామని, అవన్నీ ఎండలకు ఎండిపోకుండా నీళ్లు పోసేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామని చెప్పారు. త్వరలోనే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తామని, ఆ సమావేశంలో మే 20 నుంచి ప్రారంభమయ్యే పల్లె ప్రగతిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపారు. 15 రోజుల పాటు నిర్వహించే పల్లె ప్రగతిలో ఏ రోజు, ఏయే కార్యక్రమాలు చేపట్టాలనేది సూచిస్తామని వివరించారు. గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలు కొన్ని వినియోగంలోకి రాలేదని, వాటికి కరెంటు, నీటి వసతి అందించేలా చూసి, వినియోగంలోకి తీసుకొచ్చేలా చేస్తామని చెప్పారు. కొత్తగా గ్రామ పంచాయతీలుగా మారిన గ్రామాల్లో పంచాయతీ భవనాలను నిర్మించేందుకు సీఎం కేసీఆర్ బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. గతంలో ఒక భవనానికి రూ.20 లక్షల వరకు ఇస్తే, ప్రస్తుతం రూ.25 లక్షలకు పెంచామని తెలిపారు. భవనాల డిజైన్లు తయారు చేశామని, సీఎం కేసీఆర్ సూచనలు, సలహాలకు అనుగుణంగా త్వరలోనే ఆదేశాలిస్తామని వెల్లడించారు. అవసరమైన భూమిని గుర్తించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.