హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలోనే పల్లె దవాఖానలు ప్రారంభం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ వేదికగా ప్రకటించారు. శాసనసభలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. హైదరాబాద్ నగరంలో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని టార్గెట్ ఇచ్చాను. డివిజన్కు రెండు చొప్పున ఏర్పాటు చేయాలని చెప్పాను. కొన్ని బస్తీల్లో మూడు పెట్టాలని చెప్పాను. మొత్తానికి నగరంలో బస్తీ దవాఖానలు నిరుపేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఆరోగ్య సదుపాయాలు పెంచాలనే ఉద్దేశంతో పల్లెల్లో దవాఖానలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. కరోనా, స్వైన్ ఫ్లూ లాంటి వైరస్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పల్లె దవాఖానలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. త్వరలోనే ఈ దవాఖానలు వస్తాయి. అన్ని ఏర్పాట్లు జరిగాయి. కొద్ది రోజుల్లోనే ప్రారంభం అవుతాయి. సంబంధిత శాఖ చర్యలు తీసుకుంటుంది. ఆస్పత్రుల ఆధునీకరణకు అనేక చర్యలు తీసుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు.
12,769 గ్రామాలకు పంచాయతీ సెక్రటరీలను నియమించాం. టాప్ టు బాటమ్ అన్ని పోస్టులకు ప్రమోషన్లు ఇచ్చాం. కొత్తగా అవసరమైన చోట నియామకాలు జరిపాం. మహిళలకు ప్రసూతి సెలవులు ఇచ్చినప్పుడు.. వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. అలా 980 మంది పని చేస్తున్నారు. ఎక్కడా ఖాళీ ఏర్పడ్డ వారం రోజుల్లోనే నియమిస్తున్నారు. ఇదంతా అభివృద్ధి కోసమే అన్ని అన్నారు. నిధులు విడుదల కూడా అలాగే చేస్తున్నాం అని పేర్కొన్నారు.
మీరు చెట్లు పెట్టలేదు. అభివృద్ధి చేయలేదు. మేం రెండింటిని చేస్తున్నామని స్పష్టం చేశారు. మంచినీళ్ల కోసం గోస ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలో బిందెల ప్రదర్శన లేదు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు గ్రామపంచాతీయలను, ఇతర ఆస్తులను కుదవపెట్టాలని కేంద్రం చెబుతుంది. మంచినీళ్ల కోసం మిషన్ భగీరథను చూసి నీతిఆయోగ్ ప్రశంసించింది. రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి నీతి ఆయోగ్ సూచిస్తే 24 పైసలు కూడా ఇవ్వలేదు. అవార్డులు మాత్రం మోయలేనన్ని వచ్చాయి. మిషన్ భగీరథ పుణ్యమా అని ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ విజయం సాధించింది. ఈ విషయాన్నే కేంద్రం అధికారికంగా ప్రకటించింది అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.