నల్లగొండ : భారతీయ జనతాపార్టీతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందని సీపీఐ మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో మంత్రి జగదీశ్ రెడ్డితో వామపక్షాల సమావేశం ముగిసిన అనంతరం పల్లా వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మునుగోడు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలను ఆయన ఉటంకించారు. కేంద్రంలో కొలువుదీరిన ఆ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు పేద ప్రజలకు భారంగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరాన్ని జాతీయ స్థాయిలో గుర్తించమన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీన పడడంతో టీఆర్ఎస్తో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బీజేపీని అడ్డుకునే శక్తి టీఆర్ఎస్కు మాత్రమే ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అందులో భాగంగానే మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని పకడ్బందీగా రూపొందించినట్లు పల్లా వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.