జనగామ, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): జనగామలో డిసెంబర్ 3వ తేదీన బీఆర్ఎస్ గెలిచి గులాబీ జెండా ఎగరడం తథ్యమని, ఆ నమ్మకం, విశ్వాసం తనకుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలింగ్ రోజు కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం నాయకులు దౌర్జన్యంతో గులాబీ పార్టీ గెలుపును అడ్డుకోవాలని బీఆర్ఎస్ కార్యకర్తపై భౌతికదాడులకు దిగారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి దశమంత్రెడ్డి చిన్నపిల్లల మాదిరిగా కృష్ణప్రసాద్ అనే కార్యకర్తను కొట్టడం, కాంగ్రెస్ అభ్యర్థి కుమారుడు రాకేశ్రెడ్డి దౌర్జన్యానికి దిగడం, సీపీఎంకు చెందిన బూడిద గోపి రౌడీ, గూండాల్లా ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు పల్లా పేర్కొన్నారు. ఏదైనా అభ్యంతరం ఉంటే అధికారులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప దాడులకు దిగడం శోచనీయమని, దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. పార్టీ లైన్కు కట్టుబడి 45 రోజులు నాయకులు, కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేసిన ఫలితంగానే జనగామలో బీఆర్ఎస్ను గెలిపించుకోబోతున్నామని స్పష్టం చేశారు. రాత్రనక, పగలక పార్టీ కోసం పనిచేసిన శ్రేణులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పల్లా చెప్పారు. భవిష్యత్లో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేద్దామని కోరారు. చాలా గౌరవప్రదంగా బీఆర్ఎస్ పార్టీ గెలువబోతుందని, ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఇతర జిల్లాల నుంచి మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు వచ్చి తన కోసం పని చేశారని, వారందరికీ పల్లా రాజేశ్వర్రెడ్డి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.