హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు లీకైనప్పుడు అక్కడి ప్రభుత్వంలోని మంత్రులు, సీఎంలు ఎందుకు రాజీనామా చేయలేదని రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగులు ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలతో మనోసె్థైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. చదువుకున్న వ్యక్తి, గతంలో ప్రభుత్వ నియామకాలు చేపట్టిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కూడా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. సోమవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, కేపీ వివేకానందతో కలిసి పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిరుద్యోగులను రెచ్చగొట్టేలా, అవమానించేలా, అనుమానించేలా హీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ వచ్చాక టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా జరుగుతున్నాయని చెప్పారు. దానితో పాటు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 46,500 ఉద్యోగాలు, గురుకులాల బోర్డు, వైద్యారోగ్య శాఖ, జెన్కో, ట్రాన్స్కో, సింగరేణి బోర్డుల ద్వారా నియమకాలు జరిగాయని తెలిపారు. చదువు రాని ప్రతిపక్ష నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని, చదువుకున్న బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా వారిలాగే మాట్లాడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రవీణ్ కుమార్ గతంలో గురుకులాల కార్యదర్శిగా నియామకాలు జరిపారని, ఆనాడు ఏ ప్రజాప్రతినిధులైనా ఉద్యోగాల కోసం రికమెండ్ చేశారా? అని ప్రశ్నించారు. రాజకీయాలు, వ్యక్తిగత కోపంతో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్రెడ్డిని విమర్శించడం ప్రవీణ్కు తగదని సూచించారు. సిట్ విచారణతో నిజాలు బయటపడతాయని చెప్పారు.
బీజేపీ రాష్ట్రాల్లో ఏం చేశారు?: వివేక్
కేటీఆర్కు వస్తున్న జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును ఓర్చుకోలేక పిచ్చి విమర్శలు చేస్తున్నారని ప్రతిపక్షాలపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ను మంత్రి వర్గం నుంచి తప్పించాలని అర్థం లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘మధ్యప్రదేశ్లో పేపర్ లీకేజీ ఘటన తర్వాత 46 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ సమయంలో అకడి సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ రాజీనామా చేశారా? బండి సంజయ్ దీనికి సమాధానం చెప్పాలి. గుజరాత్లో పరీక్షల లీకేజీ సర్వసాధారణం. మోదీ రాజీనామా చేశారా?’ అని ప్రశ్నించారు. రాజస్థాన్లో 13 సార్లు పేపర్లు లీక్ అయితే అకడి సీఎం రాజీనామా చేశారా? అని కాంగ్రెస్ నేతలను నిలదీశారు. మంత్రి కేటీఆర్పై తప్పుడు ప్రచారం చేస్తే, దుష్ప్రచారం మానకపోతే లీగల్ నోటీసులు ఇస్తామని హెచ్చరించారు.
కవిత కడిగిన ముత్యంలా వస్తారు: గండ్ర
పేపర్ లీకేజీ ఘటనపై బండి సంజయ్, రేవంత్రెడ్డి గోబెల్స్కు వారసుల్లా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. టీఎస్పీఎస్సీ స్వతంత్ర సంస్థ అని, పేపర్ లీకేజీకి మంత్రి కేటీఆర్కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. కేటీఆర్ పీఏకు కూడా ఇందులో సంబంధం అంటగట్టడం బాధ్యతా రాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ పీఏ గ్రామంలో 10 మంది గ్రూప్-1 రాస్తే ఒకరే సెలెక్ట్ అయ్యారని, కానీ, 100 మంది ఎంపికైనట్టు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ బట్ట కాల్చి మీద వేస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్రెడ్డి ఓటుకు నోటు దొంగ అని, ఆయన కూడా నీతులు చెప్తున్నారని అన్నారు. ఉద్యోగాల నియామకం జరిగితే సీఎం కేసీఆర్కు మంచి పేరు వస్తుందనే ప్రతిపక్షాలు నియామకాలు ఆపే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని, ఆ కేసు నుంచి ఆమె కడిగిన ముత్యంలా బయటకు వస్తారని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పాపులారిటీని తట్టుకోలేకే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సుజనా చౌదరి, సీఎం రమేశ్ లాంటి వారిపై కేసులు ఉన్నాయని, వారు బీజేపీలో చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మాలా పునీతులు అయ్యారని ఎద్దేవా చేశారు.