జనగామ, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టి ఇప్పటికీ అమలవుతున్న సంక్షేమ పథకాలకు కొత్త పేర్లు పెట్టిన కాంగ్రెస్ సర్కార్.. 420 హామీలు, ఆరు గ్యారెంటీల అమలును గాలికి వదిలి ప్రజలను మరోసారి మోసం చేసిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం జనగామలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ భృతి..జాబ్ క్యాలెండర్ ప్రస్తావనలేదని, పీఆర్సీ, డీఏ, పెన్షనర్లకు బెనిఫిట్స్ చెల్లింపునకు బడ్జెట్లో ఊసేలేకుండా ధోకా చేసిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్పై మహిళలు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, పెన్షనర్లు పెట్టుకున్న ఆశలు అడియాసలు అయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్, మహిళలకు రూ.2,500, ఆడపిల్లలకు స్కూటీలు, ఆడబిడ్డల పెండ్లికి తులం బంగారం అటకెక్కిందని ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్ ఆందోళన ఫలితంగానే మార్క్ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని చెప్పారు. పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకం బీఆర్ఎస్ ఏర్పాటు చేసిందేనని, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభిస్తున్నట్టు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.