హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): అదానీ కుంభకోణంపై స్పందించని బీజేపీకి, ప్రధాని మోదీకి అవినీతిపై మాట్లాడే హక్కులేదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మండిపడ్డారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో అభివృద్ధి కార్యక్రమాల పేరిట ఏర్పాటు చేసిన అధికారిక సభ కాస్తా రాజకీయ సభగా మార్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో పల్లా రాజేశ్వర్రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. మోదీ సభలో గతంలో చెప్పిందే ఇప్పుడూ చెప్పారని.. తొమ్మిదేండ్లలో తెలంగాణకు చేసిందేమీ లేదని ఎద్దేవాచేశారు. బీబీనగర్ ఎయిమ్స్ను ఈ రోజే మొదలు పెడుతున్నట్టు మోదీ నమ్మించే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. ఎయిమ్స్కు రాష్ట్ర ప్రభుత్వం భూమిని గతంలోనే ఇస్తే, అసలు కేటాయించలేదన్నట్టు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ట్రిపుల్ ఆర్లో కేంద్రం ప్రమేయం లేకున్నా, కేంద్రానిదే అన్నట్టు మోదీ అబద్ధాలు చెప్తున్నారన్నారు. జాతీయ రహదారులకు తొమ్మిదేండ్లలో కేంద్రం రాష్ట్రానికి రూ.20 వేల కోట్లు కేటాయిస్తే.. ఇప్పటికే రూ.9 వేల కోట్లు టోల్రూపంలో రాష్ట్ర ప్రజల నుంచి వసూలు చేశారని స్పష్టంచేశారు. తొమ్మిదేండ్లలో కేంద్రం ఒక కొత్త రేషన్ కార్డు కూడా కేటాయించలేదని, ప్రధాని హోదాలో ఉండీ మోదీ అబద్ధాలు ఆడొచ్చా? అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ దాడులు
దేశంలో సీబీఐ, ఈడీ, ఐటీలు ప్రతిపక్ష పార్టీల నాయకుల మీదే ఎందుకు దాడులు చేస్తున్నారు? అధికార బీజేపీ నాయకుల మీద దాడులు ఎందుకు చేయడం లేదు అని పల్లా ప్రశ్నించారు. బీజేపీలో చేరగానే కేసులు ఎలా మాఫీ అవుతున్నాయంటూ మోదీని నిలదీశారు. ఈడీ, సీబీఐ దాడులపై ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లకూడదా? అని ప్రశ్నించారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో సీబీఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని అనలేదా? అని నిలదీశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అదానీకి కట్టబెడతారేమోననే అనుమానం వ్యక్తం చేశారు. మోదీకి ఇవే చివరి ఎన్నికలని, బీజేపీ మరో మారు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
కేంద్రం వద్ద ఉన్న వినతులు, తీర్మానాలు పరిష్కరించండి : ఎమ్మెల్సీ ఎల్ రమణ
కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న రాష్ట్ర ప్ర భుత్వ వినతులు, శాసనసభ తీర్మానాలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ సూచించారు. సీఎం కేసీఆర్, మంత్రివర్గ సభ్యులు, అధికారులు అనేక విన్నపాలు చేసినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తప్పుడు మాటలు చెప్పడం సరికాదని మోదీని ఉద్దేశించి అన్నారు. మోదీ ఓ ప్రధాని లాగా కాకుండా గల్లీ నాయకుడిలా మాట్లాడారని విమర్శించారు. అభివృద్ధిలో తెలంగాణకు వచ్చే అవార్డులు, రివార్డులు కనిపించడం లేదా? మోదీని నిలదీశారు.
రాష్ట్ర పథకాల్లోనే ఎక్కువ మందికి నగదు బదిలీ
నగదు బదిలీ పథకంపై ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పారని, నగదు బదిలీ పథకంలో ఎకువ మంది లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లోనే ఉన్నారని పల్లా చెప్పారు. 65 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.65 వేల కోట్లు అకౌంట్లలో వేసింది సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమని వెల్లడించారు. 45 లక్షల మందికి ఆసరా పింఛన్లు నగదు బదిలీ పథకం కింద ఇస్తున్నదని.. ఇవేవీ మోదీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.