హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతు బాగుపడితే కొన్ని సంస్థలు, ఓ పత్రిక ఓర్వలేకపోతున్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయని, ఆంధ్రజ్యోతి పత్రిక అసత్య కథనాన్ని వండివార్చిందని విమర్శించారు. రైతు స్వరాజ్యవేదిక, ఆంధ్రజ్యోతి పత్రిక, షర్మిల పనిగట్టుకొని రాష్ట్ర రైతాంగం మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రైతు ఆత్మహత్యల విషయంలో ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైం రికార్డు బ్యూరో) వెల్లడించిన నివేదిక కన్నా రైతు స్వరాజ్యవేదిక ప్రామాణికమైందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్సీలు గంగాధరగౌడ్, బస్వరాజు సారయ్య, తాతా మధుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు ఆత్మహత్యల విషయంలో ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించిన కథనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉంటే రైతు స్వరాజ్య వేదిక, ఆంధ్రజ్యోతి పత్రిక ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా 6.59 శాతం అని, అది ఇంకా పురోభివృద్ధిలో ఉన్నదని నీతి ఆయోగ్, ఆర్థిక రంగ నిపుణులు రమేశ్చంద్ పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. నీతి ఆయోగ్ లాంటి సంస్థ తెలంగాణలో వ్యవసాయ స్థితిగతులు బాగున్నాయని ప్రశంసించిన వార్తలు రాయటానికి సదరు పత్రిక ఇష్టపడదని చెప్పారు. రాష్ట్రంలో సాగువిస్తీర్ణం, పంటల దిగుబడి, వ్యవసాయ పెట్టుబడులు ఇలా అనేక రంగాలను ఆ పత్రిక తనకు ఇష్టమైన విధంగా వక్రీకరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు స్వరాజ్య వేదిక విశ్వసనీయత ఏమిటి?
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం అసత్యమని పల్లా రాజేశ్వర్రెడ్డి మండిపడ్డారు. రైతు స్వరాజ్య వేదిక ఇచ్చిన నివేదిక ఎన్సీఆర్బీ నివేదిక కన్నా ప్రామాణికమైంనదా? అంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో 300 శాతం రైతు ఆత్మహత్యలు తగ్గాయని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొన్నదని గుర్తుచేశారు. 2014లో 1,443 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే 2021లో 440 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని పత్రిక అసత్య కథనం రాసిందని చెప్పారు. ఎన్సీఆర్బీ చెప్పిన లెక్క ప్రకారం 352 మంది (భూమి కలిగిన రైతులు 303 మంది, కౌలు రైతులు 49 మంది) ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. ఇటువంటి అసత్యపు రాతలు రాస్తూ రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీయొద్దని హెచ్చరించారు. ఎన్సీఆర్బీ 2022 నివేదిక ఇంకా ప్రకటించకపోయినా రాష్ట్రంలో 512 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, అది రైతు స్వరాజ్యవేదిక అధ్యయనంలో తేలిందని ఆంధ్రజ్యోతి పత్రిక పేర్కొనటం దుర్మార్గమని అన్నారు.
రైతు స్వరాజ్యవేదిక ఎన్సీఆర్బీ కన్నా ప్రామాణికమైనదా? అసలా సంస్థకు ఉన్న విశ్వసనీయత ఏమిటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛంద సంస్థ ముసుగులో రాష్ట్ర రైతాంగాన్ని అయోమయానికి గురిచేస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వకూడదని, రైతుబంధు పథకం, రైతుబీమా పథకాలు ఇవ్వకూడదని రైతు స్వరాజ్యవేదిక పేర్కొన్న విషయాన్ని పల్లా ఈ సందర్భంగా గుర్తుచేశారు. రైతు ఏ కారణం చేత మరణించినా రైతుబంధు పథకాన్ని వర్తింపచేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో రైతులు బాగుపడితే రైతు స్వరాజ్యవేదిక, ఆంధ్రజ్యోతికి కండ్ల మంటగా ఉన్నదని విమర్శించారు. భూమిలేనివారు ఆత్మహత్య చేసుకున్నా రైతుల కింద జమచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
నిజాలు కండ్లచూడరెందుకు?
రాష్ట్రంలో పంట దిగుబడి తగ్గిందని, విస్తీర్ణం తగ్గిందని ఆంధ్రజ్యోతి పూర్తిగా అసత్యాలు రాసిందని పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో 2014లో పంట విస్తీర్ణం 135 లక్షల ఎకరాలైతే అది ప్రస్తుతం 230 లక్షల ఎకరాలకు పెరిగిందని తెలిపారు. 2014లో కేవలం 24 లక్షల టన్నుల ధాన్యం ఎఫ్సీఐకి పంపితే, అది 2020కి 141 లక్షల టన్నులకు చేరిందన్నారు. ఈ లెక్కన విస్తీర్ణం పెరిగినట్టా తగ్గినట్టా? అని ఆయన ప్రశ్నించారు.
కేంద్రం తీరుపై ఎందుకు స్పందించరు?
కొన్ని సంస్థలు, పత్రికలు రైతులకు తీవ్రమైన నష్టం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా మేలు చేసే రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయటమే పనిగా పెట్టుకున్నాయని పల్లా రాజేశ్వర్రెడ్డి మండిపడ్డారు. పత్తి రైతుకు కనీస మద్దతు ధర కల్పించాల్సిన సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా), రైతు కల్లాల నిధులను తిరిగి ఇవ్వాలన్న కేంద్రం తీరును ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. ఎరువుల ధరలు పెంచింది ఎవరని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని రైతు స్వరాజ్య వేదికలు ఎందుకు చెప్పవని ప్రశ్నించారు.
ఉరికిచ్చి కొడతాం..
రాష్ట్రంలో రైతు ప్రయోజాలకు, వారి మనోభవాలకు విరుద్ధంగా వ్యవహరించే వారి పట్ల కఠినంగా ఉంటామని పల్లా హెచ్చరించారు. రైతులను తప్పుదారిపట్టించే చర్యలకు పాల్పడితే రైతు స్వరాజ్య వేదికను ఉరికిచ్చి కొడతామని ఆయన హెచ్చరించారు. ఏసీ రూముల్లో నివేదికలు తయారు చేసి పబ్బం గడుపుకునే తీరు మార్చుకోవాలని సూచించారు. దమ్ముంటే కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ఆయన హితవు పలికారు.
బీజేపీకి కొమ్ముకాస్తున్న కాంగ్రెస్
బీజేపీకి కాంగ్రెస్ కొమ్ముకాస్తున్నదని పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేల ఎర కేసులో తాము ఇంప్లీడ్ అవుతామని కాంగ్రెస్ వ్యాఖ్యానించటంపై ఆయ న స్పందించారు. ఇంప్లీడ్ అయినా ఇంకేమైనా తమకేం అభ్యంతరం లేదని చెప్పా రు. అసలు కాంగ్రెస్ పార్టీ ఊరు పేరు ఉన్నదా? అని ఆయన ప్రశ్నించారు.