Palamuru Rangareddy Project | పాలమూరు గడ్డపై అపూర్వ జలదృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నీటి ఎత్తిపోతలను సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అద్భుత ప్రాజెక్టుపై యావత్ దేశం దృష్టిపెట్టింది. సోషల్మీడియాలోనూ దీనిపైనే చర్చ జరుగుతోంది. దశాబ్దాల కల సాకారం చేయడంలో సీఎం కేసీఆర్ కృషిని కీర్తిస్తూ పోస్టులు పెడుతున్నారు. దశాబ్దాల పాలనలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఉత్తమాటలు చెప్పి కాలయాపన చేస్తే.. సీఎం కేసీఆర్ కేవలం తొమ్మిదేండ్లలోనే అనేక అద్భుతాలను ఆవిష్కరించారని ట్విట్టర్ వేదికగా కొనియాడుతున్నారు. దీంతో #PalamuruRangareddyProject హ్యాష్ట్యాగ్ ట్విట్టర్ ( ఎక్స్)లో ట్రెండింగ్గా మారింది.
రాష్ట్ర ఇంజినీరింగ్ చరిత్రలోనే మరో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా సాగునీటి కోసం కలలుగంటున్న పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేశారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. సీఎం కేసీఆర్ నార్లాపూర్ పంప్హౌస్ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను ఆన్ చేసి, జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు. అనంతరం అంజనగిరి రిజర్వాయర్లోకి చేరిన కృష్ణమ్మ జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జలహారతి పట్టారు.