మహబూబ్నగర్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అంతర్జాతీయ విమానాశ్రయానికి గంట వ్యవధిలో చేరుకునే అవకాశం ఉన్న మహబూబ్నగర్ను త్వరలో మెడికల్ టూరిజం హబ్గా మార్చేందుకు అమెరికాకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. విదేశాలతో పోలిస్తే మన వద్ద సూపర్ స్పెషాలిటీ వైద్యం తక్కువ ఖర్చుతో చేయించుకునే అవకాశం ఉన్నదని తెలిపారు. సోమవారం పాత కలెక్టరేట్లో మంత్రి మీడియాతో మాట్లాడారు. పాలమూరు యూనివర్సిటీకి పక్కన నూతనంగా ఏర్పాటు కానున్న బైపాస్ రోడ్డు సమీపంలో పదెకరాల స్థలంలో అధునాతన కోర్టు భవనాన్ని నిర్మించనున్నట్టు చెప్పారు.
నూతన కలెక్టరేట్ను ప్రారంభించేందుకు మహబూబ్నగర్కు వచ్చిన సీఎం కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పాత కలెక్టరేట్ ప్రాంగణంలో అధునాతన సూపర్ స్పెషాలిటీ దవాఖానకు వారం, పది రోజుల్లో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు భూమిపూజ చేస్తారని శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్నగర్లో 10 వేల మందికి ప్రత్యక్షంగా, వేలాదిమందికి పరోక్షంగా ఉపాధి అందించే అమరరాజా బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటు కాబోతున్నదని, దీనికి అనుబంధంగా అనేక పరిశ్రమలు, వ్యాపారాలు విస్తరిస్తాయని చెప్పారు. భవిష్యత్తులో ఐటీతోపాటు ఇతర పరిశ్రమలు భారీగా తరలివస్తాయని ఆయన తెలిపారు.