హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. సోమవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రానున్న లోక్సభ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపై చర్చించారు. ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ విడుదలై నామినేషన్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో దీనిపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ స్థానంతో పాటు నాగర్కర్నూల్ లోక్సభ స్థానంలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించారు.
ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలపై పార్టీ అధినేత కేసీఆర్ మంగళవారం విసృ్తతస్థాయి సన్నాహక సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు మహబూబ్నగర్, నాగర్కర్నూలు నియోజకవర్గాల్లో పార్టీ విజయావకాశాలు బలంగా ఉన్నట్టు తెలిపారు. సమావేశంలో జిల్లాకు చెందిన మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.