యాదాద్రి భువనగిరి, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ప్యాకేజీ యాత్రగా మారింది. పార్టీకి క్యాడర్ లేకపోవడం, యాత్రకు జనం నుంచి ఆశించిన స్పందన కనిపించకపోవడంతో బీజేపీ నాయకులు పెయిడ్ టీంను ఏర్పాటు చేసుకొన్నారు. ఒక్కొక్కరికి రూ.20 వేలు చెల్లించి మరీ 500 మందిని ప్రత్యేకంగా పాదయాత్ర కోసం నియమించుకొన్నట్టు సమాచారం. వీరిలో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. వీరికి ఖానా, టిఖాన కూడా పార్టీనే చూసుకొంటున్నది. యాత్ర ముగిసే దాకా వీరంతా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పక్కనే ఉంటూ అహో.. ఓహో అని జేజేలు కొడుతూ ముందుకు సాగాల్సి ఉంటుంది. పాదయాత్రకు విశేష స్పందన వస్తున్నదని చెప్పుకోవడానికి ఇలా ఏర్పాటు చేసుకొన్నట్టు తెలుస్తున్నది. కాగా, యాత్రలో పాల్గొంటే రూ.20 వేలు వస్తాయన్న ఆశతో తాను ఇక్కడికి వచ్చానని ఓ వ్యక్తి చెప్పాడు.
క్యాడర్ లేక తంటాలు..
యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీకి ఏ స్థాయిలోనూ క్యాడర్ లేదు. చెప్పుకోదగిన లీడర్లూ లేరు. ఇటీవల ఒకరిద్దరు పార్టీలోకి వచ్చినా అంతర్గత విభేదాలు ముసురుకొన్నాయి. భువనగిరి పట్టణంలో అరకొర కౌన్సిలర్లు తప్ప ఎక్కడా ప్రజాప్రతినిధులు లేరు. ఉన్న ఒక్కరిద్దరు కార్యకర్తలు కూడా పాదయాత్రలో కిలోమీటర్ల మేర నడువలేని పరిస్థితి. మంగళవారం యాదగిరిపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఇదే పరిస్థితి కనిపించింది. అందుకే కమలం పార్టీ పెయిడ్ టీంతో పాదయాత్రను నడిపిస్తున్నదని తెలుస్తున్నది.
ఆహా.. ఓహో అంటూ
పాదయాత్ర ముగిసే వరకు పెయిడ్ టీం బండి సంజయ్ వెంటే ఉంటుంది. గ్రూపులుగా విడిపోయి యాత్రలో పాల్గొంటాయి. బండికి జేజేలు పలుకడం, ఆయన్ని హీరోగా చూపడమే ఆయా గ్రూపుల పని. స్పందన బాగుందని చెప్పుకోవడానికి వారంతా ఎప్పుడూ యాత్రలోనే ఉంటారు. బీజేపీ జెండాలు మోస్తూ, నినాదాలు ఇస్తుంటారు. పాదయాత్రకు జనం బాగా వస్తున్నారని, ఆదరిస్తున్నారని గొప్పలు చెప్పుకోవడానికి బీజేపీ ఈ విధంగా ప్లాన్ చేసింది. ఇక ఇంటి దగ్గర ఖాళీగా ఉండే బదులు.. పది రూపాయలైనా దొరుకుతాయనే ఆశతో యాత్రకు వచ్చినట్టు ఓ వ్యక్తి చెప్పుకొచ్చారు. బీజేపీ మాత్రం తాము సొక్కం బంగారం అన్నట్టు మాట్లాడుతున్నది. పైసా ఇయ్యకున్నా జనం వస్తున్నారని గప్పాలు కొడుతున్నది.
రూ.500 ఇస్తామన్నా ఎవరొస్తలే..
ప్రజా సంగ్రామ యాత్రకు జనాన్ని సమీకరించడం బీజేపీ నేతలకు తలనొప్పిగా మారింది. ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో నానా పాట్లు పడుతున్నారు. రోజుకు రూ.500 చొప్పున ఇస్తామన్నా రావడం లేదు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో తీవ్ర అసంతృప్తితో ఉన్న జనం వీరి సభ కోసం రావడం లేదు. నిత్యావసరాలు, పెట్రో ధరల పెంపు, అడ్డగోలుగా జీఎస్టీ విధింపు ఇలా అనేక అంశాలతో బీజేపీ అంటేనే ప్రజలు విరక్తి చూపుతున్నారు.
నాన్లోకల్ పెత్తనమేందని క్యాడర్ ఫైర్..
బీజేపీ పాదయాత్రలో నిర్వహణ, ఏర్పాట్లు వంటి అన్ని విషయాలను స్థానికేతరులే చూస్తున్నారు. ముఖ్యంగా స్టేట్ టీం కోఆర్డినేట్ చేస్తున్నట్టు లోకల్ లీడర్లు చెప్తున్నారు. పాదయాత్ర షెడ్యూల్ కూడా స్టేట్ ఆఫీసు నుంచే వస్తున్నదని, తమకేమీ తెలియడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు మొదలుకొని క్యాటరింగ్, ఆర్థిక వ్యవహారాలు సైతం రాష్ట్ర బృందమే చూసుకుంటున్నది. దాంతో స్థానిక లీడర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి స్టేజీపై కూడా స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇదే విషయమై మంగళవారం భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన స్టేజీపైకి తమను పిలువలేదని స్థానిక నేతలు మండిపడ్డారు. స్థానిక కార్యక్రమంపై నాన్లోకల్ పెత్తనం ఏందని వారు ఫైర్ అవుతున్నారు.
హైదరాబాద్ నుంచి వచ్చిన..
నన్ను బండి సంజయ్ పాదయాత్రలో పని చేయడానికి తీసుకొచ్చారు. టీంలో మొత్తం 500 మంది దాకా ఆడ, మగా ఉన్నారు. ఇంటి దగ్గర ఉత్తగ ఉంటే ఏమొస్తదని పాదయాత్రకు వచ్చిన. నాతోపాటు అంతా నాన్లోకల్ వాళ్లే ఉన్నరు. హైదరాబాద్లో ఉండేవాళ్లు కొద్దిమంది ఉదయం వచ్చి సాయంత్రం పోతున్నరు. మళ్లీ తెల్లారి వస్తున్నరు.
– రమేశ్, వనస్థలిపురం (పేరు మార్చాం)
రూ.20 వేల ప్యాకేజీ ఇస్తమన్నరు..
నేను కరీంనగర్ నుంచి వచ్చిన. సంగ్రామ యాత్ర కోసం టీం ఏర్పాటుచేశారు. కరీంనగర్, వరంగల్, జగిత్యాల, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచి పిలిపించారు. యాత్ర ముగిసే దాకా ఉంటే రూ.20వేలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. మేమంతా పాదయాత్రలో బండి సంజయ్ వెంట నడవాలి. భోజనం కూడా వారే అందిస్తున్నారు.
– విజయలక్ష్మి, కరీంనగర్ (పేరు మార్చాం)