హైదరాబాద్, నవంబర్ 22(నమస్తే తెలంగాణ): ‘నేను వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి వారమైంది. ఇంతవరకు కాంట పెట్టలేదు’ ఇదీ రైతుల ఆరోపణ. ‘రైతులు నూర్పిళ్లు కాగానే వడ్లను నేరుగా కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తున్నారు. తేమ, తాలు ఎక్కువగా ఉంటున్నది. ఎఫ్సీఐ నిబంధనల ప్రకారం ఉంటేనే మేం కొనుగోలు చేయగలం లేదంటే తర్వాత మాకు సమస్య వస్తుంది’ ఇదీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల సమాధానం. ప్రతి సీజన్లోనూ ధాన్యం కొనుగోళ్లలో ఈ సమస్య ఉత్పన్నమవుతుంటుంది. ధాన్యం కొనుగోళ్లపై అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎఫ్సీఐ నిబంధనలు అమలుచేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ నష్టాన్ని కొనుగోలు కేంద్రాల నిర్వహకులు లేదా మిల్లర్లు లేదా పౌరసరఫరాలశాఖ భరించాల్సి వస్తుంది.
చాలామంది హార్వెస్టర్తో వరిని కోసి, వడ్లను ట్రాక్టర్లకు ఎత్తి నేరుగా కొనుగోలు కేంద్రాలకు తెస్తున్నారు. ఆరబెట్టని ఈ వడ్లలో తేమ శాతం అధికంగా ఉంటున్నది. తాలు, ఇతర వ్యర్థాలు ఉంటాయి. దీంతో ధాన్యం ఆరబోసి, తూర్పారబట్టాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. అప్పటికే కొనుగోలు కేంద్రాలు ఇలాంటి ధాన్యంతో నిండిపోవడంతో వాటిని అక్కడ ఆరబోయడం సాధ్యం కాదు. కాబట్టి రైతులు పొలాల వద్దే ఆరబెట్టి, తూర్పారబట్టి తీసుకొస్తే వెంటనే కొనుగోలు చేస్తారు. ఆరబెట్టి, తూర్పారబోసిన, నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొస్తేనే మద్దతు ధర లభించే అవకాశమున్నది. నిర్వాహకులు తక్కువ ధర ఇచ్చినా, ఎక్కువ తరుగు తీసినా నిలదీసే హక్కు రైతులకు ఉంటుంది.
ధాన్యం కొనుగోళ్లకు నిబంధనలు పెట్టింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎఫ్సీఐ. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తీసుకొనేందుకు నిరాకరించేది ఎఫ్సీఐ. ఈ విషయం తెలియని రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అపార్థం చేసుకుంటున్నారు. నాణ్యమైన ధాన్యం తీసుకొస్తే ఎలాంటి ఆలస్యం చేయకుండా కొనుగోలు చేస్తారు. నిబంధనలు పాటించకుండా ధాన్యం కొనడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించడం వల్ల లాభం లేదు.