హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. సొంతపన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధిరేటును సాధిస్తూ అప్రతిహతంగా దూసుకుపోతున్నది. రాష్ట్ర ఏర్పాటునాటికి రూ.37,391 కోట్లుగా ఉన్న పన్ను రాబడి.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1,26,617 కోట్లకు చేరుకున్నది. మూడురెట్ల కన్నా ఎక్కువ వృద్ధిరేటుతో తెలంగాణ కొత్త శిఖరాలకు చేరుకున్నది.
తెలంగాణ ఆర్థిక ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతున్నది. కేంద్రంలోని మోదీ సర్కారు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నది. రాష్ర్టాన్ని ఆర్థికంగా అస్థిర పరచాలని చూస్తున్నా.. సొంతకాళ్లపై నిలబడి దేశానికే రోల్ మాడల్గా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలతో అనూహ్యమైన రికార్డులు నెలకొల్పుతున్నది. సొంత పన్నుల రాబడిలో ఏటికేడు గణనీయ వృద్ధిరేటును నమోదు చేస్తున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నుల ద్వారా రూ.1,06,900 కోట్ల రాబడి వస్తుందని బడ్జెట్లో అంచనా వేసిన రాష్ట్ర ఆర్థికశాఖ.. ఏకంగా రూ.1,09,991 కోట్ల రాబడిని సాధించింది. అదేవిధంగా.. 2022-23లో రూ.1,26,606 కోట్లు వస్తుందని అంచనా వేయగా.. రూ.1,26,617 కోట్ల రాబడి వచ్చినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు సమర్పించిన నివేదికలో రాష్ట్ర ఆర్థిక శాఖ వివరించింది.
రాష్ట్ర ఏర్పాటు నాటికి (2014-14లో) తెలంగాణ పన్ను రాబడి రూ.37,391 కోట్లు మాత్రమే. కానీ, గత తొమ్మిదేండ్లలో ఇది మూడు రెట్లు పెరిగింది. 2022-23లో రూ.1,26,617 కోట్ల రాబడి వచ్చింది. ఇది తెలంగాణ ఏర్పడే నాటితో పోలిస్తే రూ.89,226 కోట్లు ఎక్కువ. కొవిడ్ సంక్షోభంతో ప్రపంచమంతా రెండేండ్లు స్తంభించిపోయినా తెలంగాణలో పన్ను రాబడి ఆశాజనకంగానే ఉన్నది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.89,047 కోట్లు వస్తుందని బడ్జెట్లో అంచనా వేయగా.. రూ.83,585 కోట్ల రాబడి వచ్చింది. ఇది బడ్జెట్ అంచనాలో 94 శాతానికి సమానం. అలాగే 2020-21లో రూ.79,339 కోట్ల రాబడి (బడ్జెట్ అంచనాలో 78%) వచ్చింది. ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో దేశంలోని అనేక రాష్ర్టాల్లో పన్ను రాబడి 50 శాతాన్ని మించకపోవడం గమనార్హం.
2022-23 ఆర్థిక సంవత్సరంలో వివిధ మార్గాల ద్వారా మొత్తం రూ.2,45,256 కోట్ల రాబడి వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేయగా.. రూ.1,92,097 కోట్ల రాబడి వచ్చింది. బడ్జెట్ అంచనాల్లో ఇది 78 శాతానికి సమానం. ఇందులో జీఎస్టీదే అగ్రస్థానం. నిరుడు జీఎస్టీ రూపేణా రూ.42,189 కోట్లు రావొచ్చని అంచనా వేయగా.. రూ.41,888 కోట్ల రాబడి (బడ్జెట్ అంచనాలో 99.29%) వచ్చింది. అదేవిధంగా నిరుడు ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.18,470 కోట్లు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.14,228 కోట్లు, అమ్మకం పన్ను రూపంలో రూ.29,604 కోట్ల రాబడి వచ్చింది. అయినా కేంద్రం మోదీ సర్కారు పెట్టిన కొర్రీల వల్ల రాష్ట్ర రాబడి కొంతమేర తగ్గింది. గ్రాంట్-ఇన్-ఎయిడ్ రూపంలో కేంద్రం నుంచి రూ.41,001 కోట్లు వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేయగా.. అందులో 31 శాతం (రూ.13,087 కోట్లు) మాత్రమే వచ్చింది. తెలంగాణపై అడుగడుగునా అక్కసు వెళ్లగక్కుతున్న మోదీ సర్కారు.. బీజేపీ పాలిత రాష్ర్టాలకు మాత్రం నిధుల వరద పారిస్తున్నది. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్కు అడిగిన దానికంటే 45% ఎక్కువే అందించింది. 2022-23లో గ్రాంట్-ఇన్-ఎయిడ్ కింద రూ.15,982 కోట్లు వస్తుందని గుజరాత్ అంచనా వేయగా.. కేంద్రం రూ.23,131 కోట్లు ఇచ్చింది.
తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్న మోదీ సర్కారు రాష్ట్రంపై అడుగడుగునా అక్కసు వెళ్లగక్కుతున్నది. తెలంగాణ అభివృద్ధిని అన్నివిధాలా అడ్డుకోవాలని చూస్తున్నది. అందులో భాగంగా ఎఫ్ఆర్బీఎం నిధుల్లో భారీగా కోతలు విధించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో తెలంగాణకు ఇచ్చే ఎఫ్ఆర్బీఎం పరిమితిని రూ.54 వేల కోట్లుగా ప్రకటించిన కేంద్రం.. ఆ తర్వాత అకస్మాత్తుగా దాన్ని రూ.39 వేల కోట్లకు కుదించింది. తద్వారా రాష్ట్రానికి అందాల్సిన నిధుల్లో రూ.15 వేల కోట్లు తగ్గాయి. వాస్తవానికి ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న రాష్ట్రాలు ఎఫ్ఆర్బీఎం పరిమితి కంటే 0.5% అదనంగా రుణాలను సమీకరించుకునేందుకు వీలుంటుంది. కానీ, దేశంలోనే అత్యంత పటిష్ట ఆర్థికశక్తిగా ఉన్న తెలంగాణ ఈ సౌలభ్యాన్ని కూడా పొందనీయకుండా కేంద్రం అడ్డుపుల్ల వేయడంతో రాష్ట్రం దాదాపు రూ.6 వేల కోట్లను కోల్పోయింది. అంతటితో ఆగని మోదీ సర్కారు తెలంగాణకు రావాల్సిన రూ.21 వేల కోట్ల బడ్జెటేతర నిధులను కూడా నిలిపివేయించింది. ఇలా నిరుడు తెలంగాణకు రావాల్సిన దాదాపు రూ.40 వేల కోట్లు కేంద్రం వివక్ష వల్ల ఆగిపోయాయి. బీజేపీ పాలిత రాష్ర్టాలతో సమానంగా తెలంగాణకు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తే మన రాష్ట్రం మరెన్నో అద్భుతాలు సృష్టించేది.