దశాబ్దం కిందటి మాట..
తెలంగాణలోని కొన్ని పల్లెలకు పోవాలంటేనే వణికిపోయే పరిస్థితి. మరి కొన్ని పల్లెల్లో పగలంతా తాళాలు వేసి నిర్మానుష్యంగా ఉన్న దుస్థితి. ఎప్పుడు తుపాకులు పేలుతాయో తెలియదు.. ఎప్పుడు మందుపాతరలు బద్దలవుతాయో అర్థం కాదు. తాము నడుస్తున్న నేల కింద ఎన్ని బాంబులున్నాయోనన్న భయం.. ఎవరు పోలీసులో.. ఎవరు విప్లవ సాయుధ పోరాటం చేసేవారో తెలియదు. అనునిత్యం సంక్షోభం. అనుక్షణం భయం భయం.. ఈ అనంత కల్లోలంలో అభివృద్ధి ఆమడ దూరానికి వెళ్లిపోయింది.
ఇప్పుడు శాంతి.. భద్రతతో కల్లోల పల్లెల్లో వసంతశోభ వెల్లివిరుస్తున్నది. సంక్షోభం లేదు. బూట్ల పదఘట్టనలు వినిపించడంలేదు. తుపాకుల మోతలు లేవు.. మందుపాతరల జాడలేదు. బాంబుపేలుళ్లతో నేలతల్లి బద్దలవడంలేదు. భూమితల్లిని చీల్చుకొని విత్తు మొలకెత్తుతున్నది. రక్తపుటేరులు పారినచోట ఎదురెక్కి వచ్చిన గోదారమ్మ సంబురంగా పారుతున్నది. నేలతల్లి అంతటా హరివిల్లు పరుచుకొని శాంతి గీతాలు వినిపిస్తున్నది. పట్టెడు మెతుకుల కోసం తండ్లాడిన పల్లెలు పుట్లకొద్దీ ధాన్యపు రాశులను చూసి మురిసిపోతున్నాయి. ఇదీ తెలంగాణ ఫలం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేండ్ల పాలన ఆవిష్కరించిన అద్భుతాలకు నిదర్శనం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రావడానికి ముందు ఇక్కడి కొన్ని పల్లెల పేర్లు వింటేనే భయం కొలిపిన వాతావరణం ఉండేది. ఒకవైపు నక్సలైట్లు.. మరోవైపు గ్రేహౌండ్ పోలీసుల కదలికల మధ్య.. ఆ పల్లెలకు ప్రగతి దారులే లేకుండా పోయాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేవి కావు. రోడ్లు లేవు.. నీళ్లు లేవు.. ఎవుసం అంతకంటే లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే బతుకులు దుర్భరమైన కాలమది. తలచుకొంటేనే ఒళ్లు గగుర్పొడిచే రోజులవి. ఇప్పుడు తెలంగాణ దేశానికే శాంతి కపోతం. ధాన్య భాండాగారం.. పచ్చని చేలతో.. ఎగిసెగిసి వచ్చిన పాతాళ గంగమ్మతో ప్రగతికి మారుపేరు. తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం నెరవేరి ఏడేండ్లయింది. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర సర్కారు అనతికాలంలోనే అద్భుతాలను ఆవిష్కరించింది. బీళ్లకు జలసిరులను మళ్లించి అమరుల ఆశయాన్ని సాధించింది. ఉమ్మడిపాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన పల్లెలను దశబ్దాల నాటి సంక్షోభాన్ని మరిపించి సంక్షేమం వైపు నడిపిస్తున్నది. విప్లవాత్మక సంస్కరణలతో ప్రజల చెంతకే పాలనను చేర్చి చింతలను తీరుస్తున్నది. ఇందుకు ఉమ్మడి రాష్ట్రంలో ముద్రవేయబడిన కల్లోలిత ప్రాంతాలే నిదర్శనం. వెనుకబాటుతనంతో.. కరువుకాటకాలతో.. ఆకలిచావులతో.. వలసలతో కునారిల్లిన పల్లెల్లో.. రగల్ జెండాలు రెపరెపలాడిన చోట.. బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవితాలను గడిపిన జనాల్లో వెల్లివిరుస్తున్న సంతోషాలే నిలువుటద్దం.
సిరిసిల్ల- జగిత్యాల..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఒకప్పటి సిరిసిల్ల, జగిత్యాల తాలుకాలు భౌగోళికంగా మెట్ట ప్రాంతాలు. ఒకవైపు మానేరు.. మరోవైపు గోదావరి పారుతున్నా తాగు, సాగునీటికి తండ్లాడిన దుస్థితి. వలసపాలకుల వివక్ష కారణంగా ఒక్క ప్రాజెక్టు పూర్తయింది లేదు. అభివృద్ధి అంటే ఇక్కడివారికి తెలిసింది లేదు. ఆకలిచావులు, గల్ఫ్ వలసలు నిత్యకృత్యంగా మారిన పరిస్థితి. ఇంకోవైపు ఈ రెండు తాలుకాలు రైతుకూలీ పోరాటాలకు కేంద్రంగా నిలిచాయి. ఈ ప్రాంతంలోనే జనశక్తి పార్టీ ఆవిర్భవించింది. పీపుల్స్వార్ ప్రాబ ల్యం కూడా ఎక్కువే. చందుర్తి, రుద్రంగి, వీర్నపల్లి, కోనరావుపేట, కథలాపూర్, మేడిపల్లి, మెట్పల్లి, ఎల్లారెడ్డిపేట, మానాల, నూకలమర్రి వంటి ప్రాంతాలు విప్లవోద్యమంలో ప్రత్యేక చరిత్రను లిఖించుకొన్నాయి. పదుల సంఖ్యలో యువకు లు విప్లవంకోసం అడవిబాట పట్టారు. ఎదురుకాల్పులు, పోలీసుల బూట్ల చప్పుళ్లతో ఈ రెండు తాలుకాలు యుద్ధక్షేత్రాలుగా మారిన కాలమది. 1978లో ఈ తాలుకాలను కల్లోలిత ప్రాంతాలుగా నాటి ఉమ్మడి పాలకులు ముద్రవేశారంటే ఇక్కడ రాడికల్ ఉద్యమ ప్రభావాన్ని అంచానా వేయవచ్చు. కానీ గత ఏడేండ్లలో ఈ తాలూకాల ముఖచిత్రాలే మారిపోయాయి. పాలనాసౌలభ్యం కోసం తెలంగాణ చేపట్టిన సంస్కరణల ఫలితంగా సిరిసిల్ల, జగిత్యాల రెండు జిల్లాలుగా ఏర్పడ్డాయి. ప్రగతిలోనూ నూతన ఒరవడిని సృష్టిస్తున్నాయి. ఒకనాడు సింగిల్ రోడ్డులేని గ్రామాలకు సైతం నేడు రెండువరుసల రహదారులు పరుచుకొంటున్నాయి. కొత్తమండలాలు, తండాలు నూతన పంచాయతీలుగా ఏర్పాటు కావడంతో పల్లెలు ప్రగతిబాట పట్టాయి. కేజీఈవీ, రెసిడెన్షియల్ విద్యాసంస్థలురావడంతో అక్షరాస్యతను కూడా సాధిస్తున్నాయి. ఒకనాడు కల్లోలిత ప్రాంతంగా పేరుబడిన సిరిసిల్ల మండలంలోని ముష్టిపల్లి 2018లో కేంద్రప్రభుత్వం అందించే దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పంచాయతీ సశక్తీకరణ్ పురస్కారానికి ఎంపికైందంటే ఎంత వేగంగా మార్పు వచ్చిందో అర్థంచేసుకోవచ్చు. కాళ్వేశ్వరం ప్రాజెక్టుతో ఈ రెండు ప్రాంతాల చరిత్రలో నూతన అధ్యాయం మొదలైంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తికావడంతో రెండేండ్లుగా ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీళ్లందుతున్నాయి. దీంతో వేములవాడ నియోజకవర్గం, జగిత్యాల జిల్లాలోని ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి. లక్షల ఎకరాలు ఇప్పటికే సాగులోకి వచ్చాయి. ప్రస్తుతం రాజరాజేశ్వర జలాశయంనుంచి ఎగురుమానేరుకు, మల్కపేట రిజర్వాయర్కు నీటిని తరలించే పనులతోపాటు కలికోట సూరమ్మ రిజర్వాయర్ పనులు చివరిదశలో ఉండగా, అవి కూడా పూర్తయితే ఈ ప్రాంతాల రూపురేఖలే పూర్తిగా మారిపోనున్నాయి.
హుస్నాబాద్..
ఒకప్పటి కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ మొదటి నుంచీ కమ్యూనిస్టులకు కంచుకోట. సాయుధ రైతాంగ పోరాటంలో ఈ ప్రాంతానికి చెందిన అత్యధిక మంది పాల్గొన్నారు. అందులో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూడా ఒకరు. ఉమ్మడి రాష్ట్రంలో రాడికల్ ఉద్యమాలకూ ఈ ప్రాంతం కేంద్రంగానే ఉన్నది. శనిగరం వెంకటేశ్వర్లు అలియాస్ సాహు నేతృత్వంలో విప్లవోద్యమం సాగింది. ఇది పూర్తి గా మెట్ట ప్రాంతమే. ఎప్పుడు వెనుకబాటుతనమే. తెలంగాణ రావడంతో దీని రూపురేఖలే మారిపోయాయి. తోటపల్లి రిజర్వాయర్తో బం గారు పంటలు పండించేస్థితికి ఎదిగిపోయింది.
చిట్యాల.. ప్రగతి భళా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నక్సల్ ఉద్యమంలో ప్రత్యేకమైనది. మండలంలోని వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల సోదరులు విప్లవోద్యమంలో అగ్రనాయకులుగా పనిచేశారు. 1980 నుంచి రగిలిన నక్సల్బరీ ఉద్యమంలో కీలకభూమిక పోషించడమేగాక, వారి ప్రాబల్యంతో నాటి చిట్యాల మండలం నుంచే చాలామంది అడవిబాట పట్టారు. ఒకనాడు చిట్యాల పేరు చెప్తేనే జనం జంకేవారు. పోలీసులు వెలిశాలలో శాంతిస్థూపాన్ని ఏర్పాటుచేసి యువత ఆ బాట పట్టకుండా చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండాపోయింది. ఈ చిట్యాల మండలం భౌగోళికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అతిపెద్ద మండలం. 56 గ్రామాలు ఉండేవి. పూర్తిగా వర్షాధారిత ప్రాంతం. ఉమ్మడి రాష్ట్రంలో చిట్యాల వరకు సింగిల్ రోడ్డు ఉన్నా, అక్కడి నుంచి ఇతర గ్రామాలకు సరైన రోడ్లు లేని దుస్థితి. జిల్లాకు చిట్టచివరి మండలం. అటవీ ప్రాంతం. చుట్టూ వాగులు. వర్షాకాలంలో ఇతర ప్రాంతాలతో రోజుల తరబడి సంబంధాలే తెగిపోయేవి. అభివృద్ధిని పట్టించుకున్న నాథుడే లేడు. స్వరాష్ట్రంలో ఈ మండలం రూపురేఖలే మారిపోయాయి. చిట్యాల భూపాలపల్లి జిల్లా పరిధిలోకి వచ్చింది. దీంతో వెలిశాలతోసహా చాలాగ్రామాల ప్రజలకు ప్రభుత్వ పాలన చేరువైంది. ఈ ఏడేండ్ల కాలంలో చిట్యాలను కలుపుతూ బీటీ రోడ్లను వేసింది తెలంగాణ ప్రభుత్వం. చిట్యాల నుం చి భూపాలపల్లి, పరకాల, జమ్మికుంటకు.. టేకుమట్ల మండలం మీదుగా గిద్దెముత్తారం వరకు, భూపాలపల్లి నుంచి గర్మిళ్లపల్లికి, రెండువరుసల రోడ్లను, వాగులపై వంతెనలను నిర్మించగా రవాణా వ్యవస్థ ఎంతో మెరుగుపడింది. చిట్యాల నుంచి మంథని, పెద్దపల్లి వరకు రహదారిని నిర్మిస్తుండగా, ఒడెడ్ వద్ద మానేరుపై బ్రిడ్జి పనులు ప్రగతిలో ఉన్నాయి. మిషన్భగీరథతో తాగునీటి సమస్యకు తెరపడింది. ఎస్సారెస్పీ మొదటి దశలో భాగంగా డీబీఎం 38 కెనాల్ ద్వారా చిట్యాల మండలానికి సాగునీరు ఇవ్వాల్సి ఉంది. ఉమ్మడి పాలకులు దానిని దశాబ్దాల తరబడి తాత్సరం చేస్తూ వచ్చారు. తెలంగాణ ఉద్యమనేతగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటుచేసిన వెంటనే అప్పటి సీఎం చంద్రబాబు ఆగమేఘాల మీద కాలువలకు నీళ్లు వదులుతున్నామంటూ రేగొండ వద్ద ట్రయల్న్ నిర్వహించారు. అంతే మళ్లీ నీళ్లమాటెత్తలేదు. తెలంగాణ ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ చేపట్టిన ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంతో చిట్యాల మండల చరిత్రలో నవశకం ప్రారంభమైంది. రూ.142 కోట్లతో కాలువలను మరమ్మతులు చేయించారు. గత రెండేండ్లుగా డీబీఎం 38 కెనాల్ ద్వారా చిట్యాల మండలంతోపాటు రేగొండ, చల్లగరిగ, టేకుమల్ల మండలాలకు సాగునీరు అందుతున్నది. చెరువులను నింపడంతో వేల ఎకరాల భూములు తిరిగి సాగులోకివచ్చాయి. ఇవాళ చిట్యాల ప్రాంతం ధాన్యపురాశుల కేంద్రంగా మారింది.
20 ఏండ్ల తర్వాత చెరువుల నీళ్లు చూసిన
నా చిన్నతనంల చెరువుల నీళ్లు చూసిన. ఇన్నేండ్లలో ఏనాడూ నీళ్లు ఇవ్వలె. రెండేండ్ల నుంచి నీళ్లు ఇస్తున్నరు. చెరువులు నింపుతున్నరు. ఇప్పటికీ చెరువుల నీళ్లు ఫుల్లుగానే ఉన్నాయి. రెండు పంటలకు ఢోకా లేదు. మాటలు చెప్పేవాళ్లనే చూసినం. చేతల్లో చేసి చూపిన నాయకుడు కేసీఆర్ ఒక్కరే. ఆయనకు రుణపడి ఉంటం. – జోగు భానుచందర్, ఉపసర్పంచ్, తిర్మలాపూర్ (చిట్యాల)
ఎట్ల మారిందో మాటల్లో చెప్పలేం..
నా ఊహతెలిసినప్పటి నుంచి ఎన్నో బీడు భూములు పడావు పడి ఉండె. రెండేండ్ల సంది చూద్దామంటే ఖాళీ భూమి కనబడతలేదు. ఒక్కపంటనే పండుడు కష్టంగా ఉండే. నీళ్లు ఉంటే కరెంటు ఉండదు. కరెంటు ఉంటే నీళ్లు ఉండవు. ఇప్పుడు రెండు పంటలు ఎలాంటి ఇబ్బంది లేకుండా పండిస్తున్నం. అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే. అందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు.
-మ్యాకల ఎల్లయ్య, చందుర్తి
ఎప్పుడూ యాసంగి పంట చేతికి రాలె..
నాకు ఆరు ఎకరాల భూమున్నది. వానలు పడితేనే పంట పండేది. యాసంగిలో వేసిన పంట ఎన్నడూ చేతికందలే. రెండేండ్ల నుంచి మా ఊరుకు తోటపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లిస్తున్నరు. ఈ యాసంగిలో మొత్తం ఆరెకరాల్లో వరి వేసిన. జనవరి నుంచి ఏప్రిల్ నెల చివరిదాక కాలువ నీళ్లిచ్చిన్రు. పంట మంచిగున్నది. దిగుబడి ఎకరాకు 28 క్వింటాళ్లు వరకు వచ్చింది. మొత్తం ఆరెకరాలల్ల కలిపి 170 క్వింటాళ్ల వడ్లను మా ఊరిలోని కొనుగోలు కేంద్రంలనే అమ్మిన. వడ్ల పైసలు కూడా పదిరోజుల్లోనే వచ్చినయ్. సీఎం కేసీఆర్ సారు
సల్లగుండాలె.
-ఆసరి ఐలయ్య, సీతారాంపూర్, చిగురుమామిడి
వానాకాలం వస్తే రాకపోకలు బంద్..
ఒకప్పటి చిట్యాలకు.. ఇప్పటి చిట్యాలకు పొంతనే లేదు. చిట్యాల నుంచి మా ఊరుకు సింగిల్ రోడ్డు ఉండేది. వానాకాలం వస్తే బస్సులే రాకపోయేది. మోకాళ్ల లోతువరకు దిగబడుతుండే. ఇప్పుడు ఎటు చూసినా డబుల్ రోడ్లే. ఇటు భూపాలపల్లికి కూడా రోడ్డు పడ్డది. రెండేండ్ల సంది చిట్యాలకు కాలువ నీళ్లు కూడా ఇడుస్తున్నరు. చెరువులను నింపుతున్నరు. రెండు పంటలకు ఢోకా లేకుండా పోయింది.
-ఏరుకొండ గణపతి, గోపాలపూర్ (చిట్యాల)