హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ నెల 9, 10న వేర్వేరు గ్రానైట్ వ్యాపార సంస్థల్లో నిర్వహించిన సోదాల్లో రూ.1.08 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ప్రకటించింది. హైదరాబాద్, కరీంగనర్లోని శ్వేత గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్, పీఎస్ఆర్ గ్రానైట్స్, అరవింద్ గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్ ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ సహా పలు కంపెనీల్లో సోదాలు నిర్వహించినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు.
వీటిలో కొన్ని కంపెనీలు విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. చైనా, హాంగ్కాంగ్, రష్యా తదితర దేశాలకు గ్రానైట్ ఎగుమతి చేసిన ఆ కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించిన రాయల్టీ లెక్కల్లో తప్పులు ఉన్నట్టు గుర్తించామన్నారు. ఆయా కంపెనీల ఆర్థిక లావాదేవీల్లోనూ అవకతవకలు జరిగాయని, పలు విదేశీ ఖాతాలకు డబ్బు మళ్లించినట్టు ఆధారాలు లభించాయని తెలిపారు.