గజ్వేల్, మార్చి 13: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 70 లక్షల మందికి కండ్ల పరీక్షలు పూర్తి చేసినట్టు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు వెల్లడించారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నిర్మించిన సీతారామ ఉమామహేశ్వరాలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. అనంతరం ఆయన మున్సిపాలిటీలోని 8వ వార్డులో కొనసాగుతున్న కంటివెలుగు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కంటి వెలుగు పరీక్షలు ఎలా ఉన్నాయని అక్కడికి వచ్చిన మహిళలను మంత్రి అడిగి తెలుసుకొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,565 గ్రామపంచాయతీల్లో, 1,616 మున్సిపల్ వార్డుల్లో కంటి వెలుగు క్యాంపులు పూర్తయ్యాయని తెలిపారు. 100 రోజుల్లో రాష్ట్రంలో కండ్ల సమస్యలున్న అందరికీ కంటి పరీక్షలు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని హరీశ్రావు వివరించారు.
నేటి నుంచే ఉమెన్ క్లినిక్ సేవలు
‘ఆరోగ్య మహిళ’లో భాగంగా నేటి నుంచి ఉమెన్ క్లినిక్ సేవలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానల్లో మొత్తం 100 కేంద్రాల్లో ఈ సేవలను అందిస్తున్నారు. ఈ క్లినిక్ల ద్వారా బీపీ, షుగర్తోపాటు క్యాన్సర్ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, అక్కడే మందులు అందిస్తారు. 8 ప్యాకేజీల్లో 57 రకాల టెస్టులు అందుబాటు లో ఉంటాయి. తీవ్ర సమస్యలుంటే నిమ్స్, ఎంఎన్జేవంటి దవాఖానలకు రెఫర్ చేస్తారు. క్లినిక్లకు వచ్చే రోగుల వివరాలన్నీ యాప్లో పొందుపరుస్తారు. వీటిని రెఫర్ దవాఖానలకు లింక్ చేస్తారు. ఆయా దవాఖానల్లో రోగులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.