తెలంగాణ వ్యవసాయరంగం కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. ఈ వానకాలం సీజన్లో ఇప్పటికే వరి సాగు విస్తీర్ణం గత రికార్డులను అధిగమించగా, వివిధ పంటల మొత్తం సాగు విస్తీర్ణం కూడా అదే బాటలో పయనిస్తున్నది. ఈ నెలాఖరు నాటికి కొత్త శిఖరాన్ని చేరుకోనున్నది. తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం పెరుగుతుంటే.. దేశవ్యాప్తంగా 5% మేర తగ్గడం ఆందోళనకర పరిణామం. మొన్నటి దాకా వరి సాగు విస్తీర్ణం తగ్గించాలని రాష్ర్టాలను కోరిన మోదీ ప్రభుత్వం ఇప్పుడేమో ప్రోత్సహించాలని సూచనలు ఇస్తున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వరిసాగు కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. వానకాలం సీజన్లో వరిసాగు విస్తీర్ణం తొలిసారిగా 62 లక్షల ఎకరాలు దాటింది. ఇది ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం. కొన్ని ప్రాంతాల్లో వరినాట్లు కొనసాగుతున్నందున నెలాఖరు వరకు ఇది మరో రెండు లక్షలు పెరిగే అవకాశం ఉన్నది. 2021-22 వానకాలం సీజన్లో 61.94 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. ఈ సీజన్లో ఇప్పటికే 62.12 లక్షల ఎకరాలకు చేరింది. ఈ సీజన్లో బుధవారం వరకు 1.32 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఇందులో అత్యధికంగా వరి 62.12 లక్షల ఎకరాల్లో సాగైంది. ఆ తరువాత పత్తి 49.58 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 6.14 లక్షల ఎకరాలు, కంది 5.57 లక్షల ఎకరాలు, సోయాబీన్ 4.29 లక్షల ఎకరాల్లో సాగైనట్టు వివరించింది.
కాల్వల్లో కాళేశ్వరం నీళ్లు.. వరి ఉరకలు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రైతులకు సాగునీటి కష్టాలు తొలగిపోయాయి. సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతున్నది. 2014 వానకాలం సీజన్లో కేవలం 22.74 లక్షల ఎకరాల్లోనే వరి సాగు కాగా ఇప్పుడు 62 లక్షల ఎకరాలు దాటింది.
రైతన్నకు దన్నుగా ఆ నాలుగు
రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొంటున్న నిర్ణయాలే కారణం. రైతులకు 24 గంటలూ ఉచిత విద్యుత్తు, రైతుబంధు నిధులను ఠంచన్గా అందిస్తుండటం, కాళేశ్వరంతోపాటు పెండింగ్ ప్రాజెక్టు లు పూర్తి చేయడం, గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో రైతుల్లో విశ్వాసం పెరిగింది.
దేశవ్యాప్తంగా తగ్గిన వరి సాగు
తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, సదుపాయాలు రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం పెరగడానికి దోహదం చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల కారణంగా దేశవ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణంలో తగ్గుదల నమోదవుతుంది. గత వానకాలంలో దేశవ్యాప్తంగా 406.89 లక్షల హెక్టార్లలో వరిసాగు కాగా ఈ సీజన్లో 383.99 లక్షల హెక్టార్లకు తగ్గిపోయింది. సు మారు 5.62% సాగు విస్తీర్ణం తగ్గింది. జార్ఖండ్లో 9.80 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్లో 6.32, పశ్చిమబెంగాల్లో 4.45, ఛత్తీస్గఢ్లో 3.91, యూపీలో 2.61, బీహార్లో 2.18 లక్షల హెక్టార్ల చొప్పున వరి సాగు విస్తీర్ణం తగ్గడం గమనార్హం. వరి సాగు చేయవద్దంటూ కేంద్రం చేసిన సూచనలే ఇందుకు కారణం. ఇప్పుడేమో వరి సాగును ప్రోత్సహించాలని కేంద్రం సూచిస్తున్నది.
రికార్డు దిశగా మొత్తం సాగు విస్తీర్ణం
రాష్ట్రంలో వరితో పాటు వివిధ పంటల మొత్తం సాగు విస్తీర్ణం కూడా పెరుగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు అత్యధికంగా 2020-21 వానకాలంలో 1.35 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. మరుసటి సంవత్సరం సాగు విస్తీర్ణం కొంత తగ్గి 1.29 కోట్ల ఎకరాలకు పరిమితైంది. ఈ సీజన్లో ఇప్పటికే 1.32 కోట్ల ఎకరాలు దాటింది. నెలాఖరు కల్లా గత రికార్డులను అధిగమిస్తుందనే అంచనాలున్నాయి.
ఇదీ తెలంగాణ రైతుల సత్తా
రికార్డు స్థాయిలో వరి సాగు చేసి తెలంగాణ రైతులు దేశానికి తమ సత్తా చాటారు. కొత్త రికార్డును సృష్టించిన రైతులకు శుభాకాంక్షలు. రైతులకు దన్నుగా ఉంటూ ఈ ఘనత సాధించేలా రైతు కేంద్రీకృత పథకాలను అమలు చేసి రాష్ట్రంలో ఎవుసాన్ని పండుగ చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-పల్లా రాజేశ్వర్రెడ్డి,రైతుబంధు సమితి అధ్యక్షుడు