Kaleshwaram | హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 6 (నమస్తే తెలంగాణ): 2023 జనవరి 10 నాటికి గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు 173.36 టీఎంసీలు. 2024, జనవరి 10 నాటికి ఇవే ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు 167.24 టీఎంసీలు. గత సంవత్సరంతో పోలిస్తే వర్షాలు పడనిదెక్కడ? ప్రాజెక్టుల్లో నీళ్లు లేనిదెక్కడ? నిరుడు ఇదే గోదావరి బేసిన్లో అన్నదాతలు ధాన్యపు సిరులు ఎలా పండించగలిగారు? ఇప్పుడు లక్షల ఎకరాలకు సాగునీరు అందక పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి? గత సంవత్సరంతో పోలిస్తే గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు 6.12 టీఎంసీలు మాత్రమే తక్కువగా ఉన్నాయి. గత సంవత్సరం పంటలకు నీళ్లు ఇవ్వడమే కాదు, నిండు వేసవిలోనూ చెరువులు మత్తళ్లు దుంకాయి. ఇప్పుడు ఆ జలసిరుల జాడ లేదు. ధాన్యపు రాశుల గలగలలు లేవు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ దుర్భిక్షం ప్రకృతి శాపం కాదు.. మానవ వైఫల్యం.. ప్రభుత్వ వైఫల్యం!
గత సంవత్సరం కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల్లో నీటి నిల్వలకు తోడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి 25.97 టీఎంసీల ప్రాణహిత జలాలను ఎత్తిపోసింది. లక్ష కోట్ల ప్రాజె క్టు నుంచి గీ.. 25.97 టీఎంసీలు ఎత్తిపోసి గొప్పలు చెప్పుకుంటారా అంటే?! కాళేశ్వరం అనేది అక్షయపాత్ర లాంటిది. ఎంత ఆకలైతే అంతమేర కడుపు నింపుతది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన 2019 నుంచి ఈ నీటి సంవత్సరం వరకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఆశాజనకమైన వరద వచ్చింది. అందుకే, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోయాల్సిన నీటి పరిమాణం తగ్గింది. అయితే, గత సంవత్సరం కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన ఆ 25.97 టీఎంసీలే కోట్ల టన్నుల ధాన్యపు రాశులకు ప్రాణాధారం అయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ క్రీడలోకి లాగి, ఉద్దేశపూర్వకంగా విస్మరించినందునే కేవలం 30 టీఎంసీలు తక్కువయ్యాయి. ప్రాజెక్టుల్లో ఉన్న 167 టీఎంసీలను వినియోగించినా చివరి తడులకు సాగునీరు లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. నిన్నటిదాకా ధాన్యాగారంగా విరాజిల్లిన తెలంగాణ ఇప్పుడు కరువు కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నది. ఇది కాలం తెచ్చిన కరువా? కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ను బదనాం చేయాలనే రాజకీయ దురుద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును విస్మరించడంతో వచ్చిన కరువా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ నెలను వదిలేసినా, ఆ తరువాత జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే మేడిగడ్డ మీదుగా 40 టీఎంసీల వరకు ప్రాణహిత జలాలు దిగువకు పోయి సముద్రంలో కలిశాయి. అందులో 25-30 టీఎంసీలను ఎత్తిపోసుకున్నా గోదావరి బేసిన్లో పంటలు ఎండిపోయేవి కావు.
గత సంవత్సరం, ఈ ఏడాది యాసంగి సమయంలో (జనవరిలో) గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు దాదాపుగా సమానంగానే ఉన్నాయి. కేవలం ఆరు టీఎంసీల వరకు మాత్రమే తేడా ఉన్నది. కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన నీళ్లు తోడవడంతో చెరువులు నిండుగా ఉండి భూగర్భజలాలు ఎప్పటికప్పుడు రీచార్జ్ అయ్యాయి. ఇప్పుడు ఆ కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్లు లోటుగా మారడంతోనే కరువు ఛాయలు అలుముకున్నాయి. ఇందుకు ఎస్సారెస్పీ ఆయకట్టే ఒక ఉదాహరణ. ఎస్సారెస్పీ, మిడ్మానేరు, ఎల్ఎండీ, ఎల్లంపల్లిలో అందుబాటులో ఉన్న నీటి నిల్వ ల్లో తాగునీటి అవసరాలను అంచనా వేసి, మిగతా నీటిని యాసంగి సాగునీటి అవసరాలకు కేటాయించడం ఆనవాయితీ. ఈ ఏడాది సైతం ఎస్సారెస్పీ స్టేజ్-1 కింద 9,65,013 ఎకరాలు ఉండగా, 8,28,297 ఎకరాలకు (3.87 లక్షల ఎకరాలకు ఆరుతడి పంటలకు, 4.41 లక్షల ఎకరాలకు తరి పంటలకు) సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దాదాపు లక్ష ఎకరాల ఆయకట్టును తగ్గించింది. ఎస్సారెస్పీ స్టేజ్-2 కింద 3,71,691 ఎకరాలు ఉండగా దాదాపు 2 లక్షల ఎకరాలకు తగ్గించింది. కడెంతోపాటు, సదర్మాట్ కింద క్రాప్ హాలిడేలను ప్రకటించింది. సింగూరు ప్రాజెక్టు కింద ఆయకట్టును కూడా కొంత మేర తగ్గించింది. నిజాంసాగర్, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల కింద ఆయకట్టును పరిమితం చేసింది. అయినప్పటికీ, ఈ ఏడాది ప్రతిపాదించిన ఆయకట్టుకు సైతం ప్రభుత్వం సాగునీటిని అందించలేకపోయింది. కాకతీయ కెనాల్ పూర్తిస్థాయి నీటి ప్రవాహ సామర్థ్యం ఎనిమిది వేల క్యూసెక్కులు. నిరుడు యాసంగి పొడవునా నిండు గర్భిణిలా కాల్వ పారింది. కానీ, ఈ ఏడాది దాదాపు 15 రోజులు మాత్రమే ఏడు వేల క్యూసెక్కులను విడుదల చేయగా, మిగతా సీజన్ మొత్తంగా గరిష్ఠంగా ఆరువేల క్యూసెక్కుల పారకం మించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎస్సారెస్పీ జలాలను సరస్వతి, లక్ష్మీ కెనాల్, ఎల్ఎండీ ఎగువన ఉన్న ఆయకట్టుకు మాత్రమే పరిమితం చేశారు. ఎల్ఎండీ దిగువన ఉన్న ఆయకట్టు మొత్తానికి దాదాపుగా కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన జలాలనే తరలిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా ఎస్సారెస్పీ ఆయకట్టుకు దాదాపు 10 నుంచి 15 టీఎంసీలు అదనంగా అవసరమవుతాయని అధికారులు యాసంగి ఆయకట్టు ప్రతిపాదనల సందర్భంగానే అంచనా వేశారు. కాళేశ్వరం నుంచి ఎత్తిపోసుకునే వెసులుబాటు ఉన్నదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయకట్టును ప్రతిపాదించారు. కానీ, ఆచరణలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం మరో రకంగా ఉండటంతో అధికారులు వెనక్కి తగ్గారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి.. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఉత్సాహం చూపారేగానీ ఎలాగైనా యాసంగిలో రైతులను గట్టెక్కిద్దాం అనే కోణంలో ఆలోచించి అధికారులకు ఆదేశాలు ఇవ్వలేదు. పాలకుల ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న అధికారులు ముందున్న ముప్పును అంచనా వేసినప్పటికీ మిన్నకుండిపోయారు. కాంగ్రెస్ సర్కార్ ఈ ప్రాజెక్టుపై అనుసరించిన దుందుడుకు వ్యవహారంతో నీటి ఎత్తిపోతల అంశాన్నేకాదు ఆ ప్రాజెక్టు పేరును ఎత్తేందుకు కూడా ఎవరూ సాహసించలేదని అధికారులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. దీంతో యాసంగి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. కాళేశ్వరం నుంచి 10-20 టీఎంసీలను ఎత్తిపోసినా ఈ పరిస్థితి వచ్చేది కాదని అధికారులు ప్రైవేట్ సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.
రాజకీయాలు వేరు, పాలన వేరు. తెలంగాణ రైతులను ఆదుకునేందుకు పాలకులు ఎవరైనా సరే, పదడుగులు ముందుకు వేయవచ్చు.ఈ నేపథ్యంలో గత డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ఎజెండాలు ఎన్నైనా ఎంచుకోవచ్చు. కానీ, తెలంగాణ రైతును ఎలా కాపాడుకోవాలనే దిశగా చిన్న ఆలోచన చేసినా వ్యవసాయం ఇంత సంక్షోభంలో పడేది కాదు. ‘యాసంగిలో రైతులను గట్టెక్కిద్దాం’ అని రేవంత్రెడ్డి ప్రభుత్వం సంకల్పం తీసుకుని ఉంటే, కచ్చితంగా ప్రాణహిత జలాలను ఎలాగైనా ఎత్తిపోసుకునేవాళ్లు.
‘మేడిగడ్డ వద్ద లోపాలున్నాయి. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చెప్తే కానీ మేం నీటిని ఎత్తిపోయం’ అని కాంగ్రెస్ ప్రభుత్వం భీష్మించుకు కూర్చున్నది. ఈ ఏడాది జనవరిలో అన్నారం బరాజ్లో 7.52 టీఎంసీలు, సుందిల్ల బరాజ్లో 5.78 టీఎంసీలు ఈ రెండింటిలో కలిపి 13.3 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. ఈ రెండు బరాజ్ల్లో కలిపి సుమారు 8.50 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునేందుకు సాంకేతికంగా అవకాశం ఉన్నదని ఇంజినీర్లు చెప్తున్నారు. ఒకవేళ ఎనిమిదిన్నర టీఎంసీలను ఎల్లంపల్లికి తరలించుకుని, వరదకాల్వ పొడవునా ఒకటిన్నర టీఎంసీల మేర నిల్వ చేసి ఉంటే వేలాది బోర్లకు జీవం వచ్చి లక్షలాది ఎకరాల పంట గట్టున పడేది. హైదరాబాద్ తాగునీటి కోసం ఎమర్జెన్సీ మోటర్ల అవసరం ఉండేది కాదు. కేసీఆర్ను, కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేయాలనే యావ తప్ప రైతులను ఆదుకుందామన్న ధ్యాస లేకపోవడం వల్లనే నేడు ఈ దుస్థితి.
జయశంకర్ భూపాలపల్లి, (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవడానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఒక ఉదాహరణగా నిలుస్తున్నది. జిల్లాలోని భీంఘణపూర్ చెరువు, గణప సముద్రం చెరువులతోపాటు కొన్ని చెరువులు మాత్రమే రైతులకు కొంత భరోసానిస్తున్నాయి. జిల్లాలో భూగర్భజల నీటి మట్టం ప్రస్తుతం 9.30 మీటర్లకు పడిపోవడం రైతాంగాన్ని కలవరపెడుతున్నది. కాటారం మండలంలో అత్యధికంగా 19.21 మీటర్లకు జలం అడుగంటిపోయింది. మహదేవ్పూర్ మండలంలో 13.23 మీటర్లు, మల్హర్ మండలంలో 10.01 మీటర్లకు నీటిమట్టం తగ్గిపోయింది. ఈ మూడు మండలాలు అటు మానేరుకు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సమీప మండలాలే. గోదావరికి పక్కనే ఉన్న పలిమెల మండలంలో సైతం 8.88 మీటర్ల లోతుకు జలం అడుగంటింది. దీనిని బట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఆవశ్యకత అవగతమవుతున్నది.
వర్షాలు లేకపోవడం, మానేరు ఎండిపోవడం, డీబీఎం-38 కాల్వలో నీరు రాకపోవడం, బోర్లు, బావుల్లో నీరు అడుగంటిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండిన పంటలపై ఇటీవల రేగొండ, శాయంపేట మండలాల రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. రేగొండలో మండలంలోని రేగొండ, రంగయ్యపల్లి, జగ్గయ్యపేట, సుల్తాన్పూర్, కొడవటంచ, వెంకటేశ్వర్లపల్లి, దామరంచ, తిరుమలగిరి తదితర గ్రామాల్లో పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.నూతనంగా 18 బోర్లు వేశారు. 54 బావుల్లో పూటిక తీస్తున్నారు. చిట్యాల మండలం, మొగుళ్లపల్లి మండలాల్లో చలివాగు ఎండిపోవడంతో సాగునీటి సమస్య జఠిలమైంది. పక్కనే మానేరు ఎండిపోవడంతో మల్హర్, టేకుమట్ల మండల రైతులు సాగునీటికి తల్లడిల్లుతున్నారు. కాటారం, మహదేవ్పూర్ మండలాల్లోనూ సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు చేపడుతున్నామనే అంశం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) మొదట్లోనే స్పష్టంగా ఉన్నది. ప్రధాన గోదావరి అంటే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు తద్వారా దిగువకు ఇన్ఫ్లోలు లేకపోవడం వల్ల తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందని, అదే సమయంలో ప్రాణహిత నుంచి ఏడాది పొడవునా ఇన్ఫ్లో ఉంటున్నందునే ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 2019లో అందుబాటులోకి వచ్చింది. అప్పుడే కాదు, అంతకు ముందు రెండు, మూడు సంవత్సరాల నుంచి కూడా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లోలు బాగా ఉన్నాయి. అందుకే ఎక్కువ మేర కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం పడలేదు. ఇన్ఫ్లోలు ఉన్నప్పుడు కూడా ఎత్తిపోయడమనేది అవివేకం. అందుకే కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు నీళ్లు అవసరమైతే అప్పుడు మాత్రమే కాళేశ్వరాన్ని వినియోగించింది. 2019 నుంచి గత సంవత్సరం వరకు ఒక్కో సంవత్సరం అవసరం మేరకు 25.97 నుంచి 61.66 టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోశారు. ఈ ఏడాది అది జరగకపోవడంతోనే 90% నీటి నిల్వలు ఉన్నా, కీలకమైన 10% నీటినిల్వలు లేక చేతికొచ్చిన పంటలు ఆగమయ్యాయి.
కాళేశ్వరం ప్రాజెక్టును విస్మరిస్తే కరువు ముప్పు పొంచి ఉంటుందని, జనవరిలోనే ‘నమస్తే తెలంగాణ’ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేసింది. పంటలు ఎండే ప్రమాదం ఉన్నదని, సాగునీరు అందని పరిస్థితి నెలకొన్నదని వివరిస్తూ కథనం ప్రచురించింది. ముఖ్యంగా… ‘కాళేశ్వరం ప్రాజెక్టును, కేసీఆర్ను బదనాం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రాణహిత జలాలను ఎత్తిపోయడం లేదు. ఈ నిర్ణయం వల్ల లక్షలాది రైతులు గోసపడతారనే చిన్న లాజిక్ను రేవంత్రెడ్డి ప్రభుత్వం మిస్సవుతున్నది’ అని అప్రమత్తం చేసినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పైపెచ్చు అంతా అవాస్తవం. కాళేశ్వరం లేకున్నా ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు సాగునీరిస్తామంటూ ప్రగల్భాలు పలికింది. తీరా నీళ్లు ఇవ్వలేక లక్షల ఎకరాలను ఎండబెట్టింది. ఒక్క ఎస్సారెస్పీ కాలువలు, దాని కమాండ్ ఏరియాలోనే దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరందని పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వ అనాలోచిత చర్యలతో సాగునీటికే కాదు, తాగునీటికీ కటకట దాపురించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని మా మండలంలో వేసవిలోనూ నీళ్లుండేవి. అన్నారం, మేడిగడ్డ బరాజ్ల్లో నీళ్లు స్టోర్ చేయడం వల్ల వ్యవసాయ బావులు, బోర్లలో పుష్కలంగా నీళ్లుండేవి. మేం ఎక్కువగా మిర్చి పంటలే వేస్తాం. మిర్చి పంటలకు నీళ్లు ఎక్కువగా అవసరం. కేసీఆర్ హయాంలో ఏనాడూ నీటి సమస్య రాలేదు. మేడిగడ్డ బరాజ్ కుంగడంతో నీళ్లు బయటికి పంపుతున్నారు. మాకు కష్టాలు మొదలయ్యాయి. త్వరగా రిపేరు చేసి నీళ్లు స్టోరేజీ చేస్తే బాగుండు. నాకు 5 ఎకరాల భూమి ఉన్నది. మిర్చి పంట వేసిన. నీళ్లకు ఇప్పటిదాక ఇబ్బంది రాలే. బోరులో నీరు అడుగంటుతుంది. పంటకు నీళ్లు సరిపోవడంలేదు. -తుంగల సమ్మయ్య, రైతు, మహదేవ్పూర్
కాఫర్డ్యాంలు, మట్టికట్టలు ఇవేవీ కావు. తక్కువ ఖర్చుతో తాత్కాలికమైన ‘గాబ్రియన్స్’ (ఇనుప వలలో బండరాళ్లు వేసి నదికి అడ్డంగా వేసేవి) వేసి జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రాణహిత జలాలను ఎత్తిపోసుకొని ఉంటే మునుపటిలాగే తెలంగాణ పచ్చగా ఉండేది. దేవాదుల ప్రాజెక్టు విషయంలో ఇన్టేక్ లెవల్కు నీటి లభ్యత కోసం ఇదే గాబ్రియన్స్ కోసం అంచనాలు రూపొందించిన సందర్భం ఉన్నది. మనసుంటే మార్గం ఉంటుంది. మేడిగడ్డ లోపాలు, ఇతరత్రా అంశాల జోలికి వెళ్లడం లేదు. కేవలం రైతులకు సాగునీరు ఇవ్వాలనే కోణంలో ఆలోచిస్తే మాత్రం రెండు నెలలపాటు దిగువకు పోయిన నీటిలో సగం ఎత్తిపోసుకున్నా రైతుల గోస ఇలా ఉండేది కాదు.
-ఒక రిటైర్డ్ సీనియర్ ఇంజినీర్ వ్యాఖ్య