హైదరాబాద్: జూరాల ప్రాజెక్టుకు మరోసారి భారీగా వరద పోటెత్తింది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుకు 2.15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీంతో అంతే మొత్తంలో నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు. ప్రస్తుతం 318.07 మీటర్ల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 9.65 టీఎంసీలకుగాను ఇప్పుడు 8.75 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
ఇక దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 3,60,802 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 3,85,809 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు. ఇప్పుడు 215.32 టీఎంసీల నీరు ఉన్నది. కుడి, ఎడమ విద్యుత్ ప్రాజెక్టుల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది.