PRLIS | హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): సమైక్య పాలనలో సాగునీరు లేక.. ఉపాధి దొరక్క.. మనుగడ సాగించే మార్గం కానరాక ఉమ్మడి పాలమూరు మొత్తం వలసబాట పట్టింది. తెలంగాణ బిడ్డలు దేశంలోని ఇతర ప్రాంతాల్లో అనేక ఆకాశహర్మ్యాలకు తమ చెమటను ధారపోశారు. భారీ సాగునీటి ప్రాజెక్టులకు రాళ్లు ఎత్తారు. దేశదేశాల్లో అనేకానేక అందమైన భవనాలకు మెరుగులు అద్దారు. మెరుపులు పూశారు. దైన్యమైన జీవితం గడిపారు. స్వరాష్ట్రంలో ఆ రాతను చెరిపేందుకు.. కన్నీటి వ్యథలను తుడిచిపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కరువు నేలపై కృష్ణమ్మను పారించి.. బీడు భూములు తడిపేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. ఏండ్లుగా అరిగోసపడ్డ వలసజీవుల కన్నీళ్లను తుడిచేందుకు ఇతర రాష్ర్టాల వలసబిడ్డలు ఈ పథకంలో తమ చెమటను ధారపోస్తున్నారు. వలస బతుకుల రాత మార్చేందుకు శ్రమిస్తున్నారు.
దాదాపు 10 రాష్ర్టాలకుపైగా కార్మికులు, ఇంజినీరింగ్ నిపుణులు, యంత్ర పరికరాల ఆపరేటర్లు రేయింబవళ్లు ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకొంటున్నారు. పరుగులు తీసేందుకు సిద్ధమవుతున్న కృష్ణమ్మ మార్గాలకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. తరతరాలు తలచుకొనే ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకోవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ రెక్కల కష్టంపై ఆవిష్కృతమైన సొరంగ మార్గాలను, రూపుదిద్దుకున్న భారీ నిర్మాణాలు, మోటర్లను చూస్తూ ఉప్పొంగిపోతున్నారు. మళ్లీ ఇలాంటి నిర్మాణంలో పాలుపంచుకొనే మహదావకాశం దక్కుతుందనేది కలేనని అంటున్నారు. ఇప్పటివరకూ ఎన్ని నిర్మాణాలు చేపట్టినా ఉపాధి లభించిందే తప్ప ఇంతటి ఆత్మసంతృప్తి పొందలేదని ఆనంద పరవశులవుతున్నారు.
పాలమూరు పనిలో 10 రాష్ర్టాల వలసబిడ్డలు
ఉమ్మడి మహబూబ్నగర్- రంగారెడ్డి జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,226 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇది రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఎత్తిపోతల పథకం కావడం విశేషం. ప్రాజెక్టు మొత్తాన్ని 21 ప్యాకేజీలుగా విభజించగా, ప్రస్తుతం 18 ప్యాకేజీల పనులను ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించిన మెఘా సంస్థనే చేపట్టడం విశేషం. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో దాదాపు 10 రాష్ర్టాలకు చెందిన కార్మికులు శ్రమిస్తున్నారు.
ఇందులో అస్సాం, బీహార్, త్రిపుర, హిమాచల్ప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మేఘాలయ, మిజోరం రాష్ర్టాల నుంచి వచ్చిన కార్మికులే అత్యధికంగా ఉన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో వివిధ విభాగాల్లో వారు సేవలందిస్తున్నారు. ఇందులో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీర్లు, సొరంగ నిర్మాణ నిపుణులు, వెల్డర్లు, వివిధ భారీ యంత్ర పరికరాల ఆపరేటర్లు, హెల్పర్లు, ఫోర్మెన్లు, సూపర్వైజర్లు ఉన్నారు. మొత్తం 18 ప్యాకేజీల్లో దాదాపుగా 7,500 మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నారు.
బెంగళూరు, భోపాల్ నుంచి ఇంజినీర్లు
ప్రాజెక్టు నిర్మాణంలో ఇతర రాష్ర్టాల కార్మికులే కాదు ఇంజినీరింగ్ నిపుణులు కూడా తమవంతు సేవలందిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులో ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యమున్న 145 మెగావాట్ల మోటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మోటర్లను ప్రభుత్వరంగ సంస్థ బెల్ రూపొందించింది. మోటర్లకు సంబంధించిన వివిధ పరికరాలను బెల్కు చెందిన మధ్యప్రదేశ్, హరిద్వార్, బెంగళూర్లోని యూనిట్లు సమకూర్చాయి. ఆయా విడిభాగాల అమరికను సైతం ఆయా యూనిట్ల ఇంజినీరింగ్ నిపుణులే ఇక్కడ పర్యవేక్షిస్తూ ప్రాజెక్టు నిర్మాణంలో తమవంతు సేవలందిస్తున్నారు.
భోపాల్కు చెందిన ఇంజినీర్లు మోటర్ల బిగింపును చేపట్టగా, మోటర్ల నిర్వహణకు సంబంధించిన ఎలక్ట్రిక్ పరికరాలు, సాఫ్ట్వేర్ కంట్రోల్ ప్యానల్ పనులను బెంగుళూరు, హరిద్వార్ నుంచి వచ్చిన ఇంజినీరింగ్ నిపుణులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సాగునీటి పారుదలశాఖకు చెందిన 500 మందికిపైగా ఇంజినీర్లు కూడా పనుల్లో పాలుపంచుకొంటున్నారు. జేఈలు, ఏఈలు, డీఈలు, ఈఈలు, ఎస్ఈలు, క్వాలిటీ కంట్రోల్ అధికారులు, డిజైన్స్ విభాగాలకు చెందిన అధికారులు ప్రాజెక్టు నిర్మాణంలో భాగమవుతున్నారు. ప్రాజెక్టు మోటర్ల కోసం 400 కేవీ సబ్స్టేషన్ నిర్మిస్తుండగా, వందలాది మంది విద్యుత్తు సంస్థ ఇంజినీర్లు సైతం పనిచేస్తున్నారు.
రేయింబవళ్లు కొనసాగుతున్న పనులు
కోర్టు కేసులు, ఆ తర్వాత ఎన్జీటీ ఉత్తర్వుల నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణ పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దాదాపు కొన్ని నెలలపాటు పనులన్నీ నిలిచిపోయాయి. ఇటీవలే పనుల నిర్వహణకు ఎన్జీటీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మూడు షిఫ్టుల్లో కార్మికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. నిర్దేశిత గడువులోగా పనులను పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు. దాదాపు ఒక్కో షిఫ్టులో 2వేల మందికిపైగా కార్మికులు పాలుపంచుకొంటున్నారు.
నా కెరీర్లో ఇదో మైలురాయి
ఐదేండ్లుగా ఇంజినీరింగ్ వృత్తిలో కొనసాగుతున్నాను. కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకోవడం చాలా గర్వంగా ఉన్నది. ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది. మా ఇంజినీరింగ్ సిబ్బంది కాకుండా ప్రతిరోజూ షిఫ్టుకు 2,500 మంది శ్రమిస్తున్నారు. ప్రాజెక్టులోని ప్రతి నిర్మాణమూ అద్భుతం. ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యమున్న మోటర్లను నా చేతుల మీదుగా అమర్చుతుండడం గర్వంగా ఉంది. ఇప్పటివరకు ఎన్నో ప్రాజెక్టుల్లో పనిచేసినా ఇంతటి ఆత్మసంతృప్తి ఎప్పుడూ కలగలేదు. నా కెరీర్లో ఇదో మైలురాయిగా, ప్రత్యేక అనుభవంగా, జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
– దీపక్యాదవ్, ఏఈ, బీహార్
చాలా గర్వంగా ఉంది
ప్రాజెక్టు మొదలు పెట్టినప్పటినుంచి ఇక్కడే పనిచేస్తున్న. సొరంగ నిర్మాణం చూసి ఆశ్చర్యపోయా. మా రాష్ట్రం నుంచి దాదాపు ఒక్కో ప్యాకేజీలో దాదాపు 50 మందికిపైగా పనిచేస్తున్నారు. ప్రాజెక్టు మొదలు పెట్టినప్పటినుంచి నిర్మాణం పూర్తవుతున్న కొద్దీ మాకే ఆశ్చర్యం వేస్తున్నది. మేమేనా ఇది కట్టిందని అనిపిస్తున్నది. ఇలాంటి ప్రాజెక్టును నా జీవితంలో ఎక్కడా, ఎప్పుడూ చూడలేదు. చూస్తానని కూడా అనుకోవడం లేదు. ఇందులో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది.
– మిథుల్ గగోయ్, అస్సాం
ఆదాయమేకాదు ఆత్మసంతృప్తి మిగిలింది..
ప్రాజెక్టులో గ్యాంట్రి క్రేన్ ఆపరేటింగ్ చేస్తున్న. ఇప్పటివరకు ఎన్నో ప్రాజెక్టుల్లో పనిచేశా. ఆదాయం వస్తుండేది. అక్కడి వరకే. ఎప్పుడూ ఇంత గొప్పగా అనిపించలేదు. కానీ జీవితంలో మొదటిసారిగా ఆదాయంతోపాటు ఆత్మసంతృప్తినిచ్చిన ప్రాజెక్టు ఇదొక్కటే. ఎందుకంటే మాది రైతు కుటుంబమే. అలాంటి రైతుల కోసమే ఈ ప్రాజెక్టు కడుతున్నారని తెలిసి ఆనందపడుతున్న. నిజంగా రైతుల కోసం ఇంత భారీ ఖర్చుతో ప్రాజెక్టును చేపట్టిన తెలంగాణ సర్కారుకు నా సలాం.
– ప్రమోద్, యూపీ
మళ్లీ ఇలాంటి అవకాశం రాదేమో..
ప్రాజెక్టులో వెల్డింగ్ పనులు చేసేందుకు త్రిపుర నుంచి దాదాపు 50 మందికిపైగా వచ్చాం. ఇప్పటికి 2 నెలలు గడిచాయి. ఇలాంటి ప్రాజెక్టులో పనిచేయడం ఇదే మొదటిసారి. సొరంగాలు, భారీ పైపులైన్లు, మోటర్లు చూసి ఆశ్చర్యపోయా. చాలా సంతోషంగా ఉంది. మళ్లీ ఇలాంటి ప్రాజెక్టులో పనిచేసే అవకాశం రాదేమో అనిపిస్తున్నది.
– అమ్కేసాన్ మారా, వెల్డర్, త్రిపుర