హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రానున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. ఓట్లు చీలిపోకుండా ఆయా రాష్ర్టాల్లో కలిసివచ్చే పార్టీలతో పనిచేస్తామని తెలిపారు. హైదరాబాద్లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏచూరి మీడియాతో మాట్లాడుతూ.. అన్ని విషయాల్లో ప్రధాని మోదీ విఫలమయ్యారని విమర్శించారు. దేశ ప్రజల్లో బీజేపీపై అసంతృప్తి పెద్దఎత్తున పెరిగిందని అన్నారు. ఓ వైపు నిరుద్యోగం పెరుగుతుంటే.. మరోవైపు ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చిందని చెప్పారు. వీటికితోడు డీజిల్, పెట్రోల్, వంట నూనెల ధరలను రోజురోజుకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతున్నదని మండిపడ్డారు. ఐదు రాష్ర్టాల్లో ఎన్నికల సంఘం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ప్రధాని మోదీ సహా ఎవరు ఎన్నికల ప్రవర్తన నియామవళిని ఉల్లంఘించినా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్నామాయ ఫ్రంట్, రీజినల్ పార్టీల ఫ్రంట్ ఏదైనా సాధారణ ఎన్నికల తరువాతే ఉంటుందని చెప్పారు. ముందే ఒక ఫ్రంట్ ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసిన దాఖలాలు మన దేశంలో ఇప్పటివరకు లేదని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా బీజేపీని ఓడించడానికి అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో పరిస్థితిని బట్టి పొత్తు
తెలంగాణలో ఎన్నికల సమయానికి ఉండే నిర్దిష్టమైన పరిస్థితులను బట్టి పొత్తుపై తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఏచూరి చెప్పారు. బీజేపీని వ్యతిరేకించే వారిని స్వాగతిస్తామని, అందులో భాగంగానే సీఎం కేసీఆర్ను కలిశామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ చాలా ప్రమాదకరంగా ఎదుగుతున్నదని, దాన్ని వ్యతిరేకించడమే తమ లక్ష్యం పేర్కొన్నారు.