Telangana | హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టున్నది ఎయిమ్స్ పరిస్థితి. దేశంలోనే అత్యుత్తమ వైద్య, విద్యాసంస్థ అని చెప్పుకుంటున్నా.. వసతుల కల్పనలో మాత్రం జిల్లా దవాఖానలతో పోటీపడుతున్నది. కేంద్రం స్వయంగా వెల్లడించిన అంశాలే ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్సభకు చెప్పిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 20 ఎయిమ్స్ ఉన్నాయి. ఇందులో ఢిల్లీలోని ఎయిమ్స్ ప్రధానమైనది. ఇందులో టీచింగ్ ప్యాకల్టీ సంఖ్య 1207. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ దవాఖాన కాబట్టి ఆ స్థాయిలో పోస్టులు ఉన్నాయి. ఇక మిగతా 19 ఎయిమ్స్ల్లో కనిష్ఠంగా 183 నుంచి గరిష్ఠంగా 315 పోస్టులు ఉన్నాయి. బీబీనగర్ సహా కొత్తగా మంజూరైన అన్ని ఎయిమ్స్కు 183 బోధన సిబ్బంది పోస్టులను మంజూరు చేసింది. 19 కాలేజీల్లో కలిపి 4,320 బోధన సిబ్బంది పోస్టులు ఉన్నాయి. ఈ లెక్కన సగటున ఒక్కో కాలేజీకి 227 మంది బోధన సిబ్బంది (డాక్టర్లు) పోస్టులు మంజూరైనట్టు లెక్క.
రాష్ట్రంలో డాక్టర్ల సంఖ్య డబుల్
మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీల్లో ఎయిమ్స్తో పోల్చితే రెట్టింపు సంఖ్యలో డాక్టర్ల పోస్టులు ఉన్నాయి. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చివరి దశలో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా ఏడు కాలేజీలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఒక్కో కాలేజీకి బోధన, బోధనేతర సిబ్బంది కలిపి 1,001 పోస్టులు మంజూరు చేసింది. ఇందులో 457 మంది బోధన సిబ్బంది కావడం విశేషం. అంటే.. ఎయిమ్స్తో పోల్చితే డాక్టర్లు రెట్టింపు సంఖ్యలో మెడికల్ కాలేజీల్లో ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు.