బీజేపీలో చేరితే చాలు మరక మాయం!
బీజేపీని ఎదిరిస్తే ఐటీ, ఈడీ, సీబీఐ వేధింపులు ..
కండువా కప్పుకోగానే సోదాలు, విచారణలు బంద్
ఎన్నికలయ్యే రాష్ర్టాల్లో దాడులతో హడావుడి..
రాజకీయ లబ్ధికి విచారణ సంస్థల దుర్వినియోగం
జేబు సంస్థలుగా మార్చేసిన మోదీ, అమిత్ షా..
విపక్ష నేతలే టార్గెట్, లొంగితే బారాఖూన్ మాఫ్
ఎలాంటి మరకనైనా మాయం చేయగలిగిన రాజకీయ మాయావి బీజేపీ. మసిపూసేదీ.. తుడిచేసేదీ అదే. పాపం పండిన వారెవరైనా ఆ పార్టీలో చేరితే చాలు.. ప్రక్షాళన జరిగి పరిశుద్ధులుగా మారిపోతారు. తనలో ఒక్క మునకవేస్తే చాలు.. పరమ పవిత్రులై పైకిలేస్తారు. కండువా కప్పుకున్న మరుక్షణమే కన్ను పొడిచే వేలు, తుడిచే వేలు అవుతుంది. ఈడీ వెంటబడటం ఉండదు.. సీబీఐ వేధింపులుండవు. ఐటీ దాడులు అకస్మాత్తుగా ఆగిపోతాయి. అవినీతి ఆరోపణలు, ఆర్థిక అవకతవకలు అన్నీ క్లీన్చిట్ పొందుతాయి.
కళంకితులెవరైనా కమలం పార్టీలో చేరగానే, పులుకడిగిన ముత్యంలా మారిపోతారు. అగ్ని పునీతలవుతారు. ఎన్ని రాష్ర్టాల్లో ఎన్నికలవేళ ఎందరు నాయకులు ‘స్వచ్ఛందం’గా బీజేపీలో చేరి.. స్వచ్ఛంగా మారిపోలేదు? ఆరోపణలన్నీ పోయి.. వాషింగ్పౌడర్తో కడిగినట్లు తళుక్కుమని మెరవలేదు? పాలసీతో పనిలేదు. సిద్ధాంతంతో సంబంధం లేదు. ఎవరినైనా ఆరోపణలతో అగాధంలోకి తోయడం.. అక్కునచేరితే అభయహస్తం ఇవ్వడం బీజేపీకి తెలిసిన ప్రతీకార రాజకీయం. ప్రజాచైతన్యం ఉన్నచోట అది పారని పాచిక.
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ‘గుజరాత్లో తయారైన వాషింగ్పౌడర్ను ఉపయోగించే వాషింగ్ మెషిన్ బీజేపీ దగ్గర ఉంది. ప్రతిపక్ష నాయకులను మొదట అది క్లీన్ చేస్తుంది. పవిత్రులుగా మారిన తర్వాత పార్టీ వారిని అక్కున చేర్చుకుంటుంది’…కేంద్ర రైల్వే, గనుల శాఖ సహాయ మంత్రి రావ్సాహెబ్ దాదారావ్ దానవే 2019లో చేసిన వ్యాఖ్యలు. అప్పటికీ, ఇప్పటికీ బీజేపీ వైఖరిలో మార్పులేదన్నది ఈ వ్యాఖ్యలతో అర్థమవుతున్నది. అధికారంలోకి వచ్చేందుకు అడ్డొచ్చే ప్రతిపక్ష నేతలను నయానో, భయానో దారికి తెచ్చుకోవాలి. కాదని ఎదురు తిరిగితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపన్ను (ఐటీ) బృందాలు రంగంలోకి దిగుతాయి. అప్పటి నుంచి సోదాలు, అరెస్టులు, విచారణల పేరుతో చిత్రహింసలు.. అవి తట్టుకోలేక బీజేపీ కండువా కప్పుకోగానే అన్నీ బంద్.
సీబీఐ, ఈడీ, ఐటీలను జేబుసంస్థలుగా మార్చుకొన్న బీజేపీ క్షుద్ర రాజకీయమిది. ఎన్నికలు ఉన్న రాష్ర్టాల్లో ప్రతిపక్ష నేతలు, సన్నిహితుల ఇండ్లపై విచారణ సంస్థలు దాడులు చేయడం ఇప్పుడు దేశంలో సర్వసాధారణమైంది. దాడులకు భయపడి లొంగిపోయిన నేతలకు స్వయంగా బీజేపీ అభయహస్తం ఇస్తున్నది. మరోవైపు తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు సైతం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తప్పించుకోవడానికి బీజేపీ శరణుజొస్తున్నారు. పవిత్ర గంగలో మునిగితే పాపాలన్నీ పోతాయన్నట్టు.. స్కాములు, స్కీములతో ప్రజాధనాన్ని లూటీచేసిన రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు బీజేపీలో చేరగానే పునీతులు అవుతున్నారు. వారి పాపాలు కాషాయ కండువా కప్పగానే ప్రక్షాళన అవుతున్నాయి. ఇదీ బీజేపీ ప్రతీకారరాజకీయం. హిమంత బిశ్వశర్మ నుంచి జ్యోతిరాదిత్య సింధియా వరకు, సువేందు అధికారి నుంచి ముకుల్ రాయ్ దాక.. బీజేపీ జెండా నీడన నిలబడి సచ్ఛీలురుగా మారిపోయినవారెందరో ఉన్నారు.
ఎన్నికలున్న రాష్ర్టాల్లో సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు
ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో ప్రతిపక్ష నేతలపై విచారణ సంస్థలతో నిరంతర దాడులు చేయించడం బీజేపీకి అలవాటుగా మారింది. అయితే ప్రతీకార రాజకీయాలను పసిగట్టి, ఆ పార్టీని చిత్తుగా ఓడించిన సందర్భాలూ ఉన్నాయి. అయినా బీజేపీ తన ధోరణి మార్చుకోలేదు. మహారాష్ట్రలో 2019 ఎన్నికలకుముందు ఎన్సీపీ అధినేత శరద్పవార్, ఆయన మేనల్లుడు అజిత్ పవార్పై ఈడీ దాడులు జరిగాయి. తమిళనాడులో గతేడాది అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కూతురు ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమతాబెనర్జీ సన్నిహితుడు పార్థ చటర్జీకి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, అతడి భార్యకు ఈడీ సమన్లు జారీ చేసింది. 2017లో కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్కు చెందిన 70 ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి. 2018 ఎన్నికల వేళ.. రాజస్థాన్ కాంగ్రెస్ నేత, సీఎం అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్, ఆయన సన్నిహితులు రాజీవ్ అరోరా, ధర్మేంద్ర రాథోడ్పై సీబీఐ, ఈడీ దాడులు జరిగాయి. ఛత్తీస్గఢ్లో సీఎం అభ్యర్థి భూపేష్ భగేల్పై సీబీఐ, ఈడీ దాడులు జరిగాయి. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ నేత కమల్నాథ్పై ఐటీ దాడులు జరిగాయి. కేరళ ఎన్నికల సమయంలోనూ సీఎం పినరయి విజయన్ను ఇరికించేందుకు గోల్డ్ స్కాం నిందితురాలు స్వప్న సురేశ్ను ఈడీ తెరపైకి తెచ్చింది. విచారణ సంస్థలతో భయపెట్టడం బీజేపీకి అలవాటుగా మారింది. అనిల్పరబ్, నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ముఖ్ (మహారాష్ట్ర), చిదంబరం, కార్తి, శివకుమార్ (కాంగ్రెస్), అభిషేక్ బెనర్జీ (టీఎంసీ) తదితర నాయకులను అరెస్టు చేసింది.
బీజేపీలో చేరి పాపాలు కడిగేసుకున్న నాయకులు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నారు. ఆ తర్వాత వారిపై విచారణ సంస్థల తనిఖీలు ఆగిపోయాయి. ఇలాంటివారిలో కొందరు ముఖ్యులను పరిశీలిస్తే..
1) సుజనా చౌదరి: టీడీపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి ఇండ్లు, కంపెనీలపై 2018 నవంబర్లో ఈడీ, 2019 జూన్ 2న సీబీఐ దాడులు జరిగాయి. ఆయన వెంటనే ఢిల్లీ వెళ్లి జూన్ 20న బీజేపీలో చేరారు. ఆ తర్వాత దాడులు ఆగిపోయాయి.
2) సీఎం రమేశ్: టీడీపీకి చెందిన సీఎం రమేశ్పై 2018 అక్టోబర్లో ఐటీ, 2019 ఏప్రిల్లో ఈడీ దాడులు జరిగాయి. ఆయన కూడా సుజనా చౌదరితో కలిసి జూన్ 20న బీజేపీలో చేరారు. ఆ రోజు నుంచే దాడులు ఆగాయి.
3) సువేందు అధికారి: పశ్చిమబెంగాల్కు చెందిన టీఎంసీ నేత. శారద మల్టీలెవల్ మార్కెటింగ్ కుంభకోణంలో 2014 నుంచి సీబీఐ పలుమార్లు ప్రశ్నించింది. 2020లో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటినుంచీ విచారణ బంద్.
4) ముకుల్ రాయ్: 2014లో పశ్చిమబెంగాల్లో లంచాలు తీసుకోవటంపై సంచలనం సృష్టించిన నారద కేసులో నిందితుడు. సీబీఐ పలుమార్లు నోటీసులు ఇవ్వడంతో 2017లో బీజేపీలో చేరారు. దీంతో విచారణ ఆగిపోయింది. పైగా 2021 మే లో ముకుల్రాయ్కి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ వెంటనే ఆయన మళ్లీ తృణమూల్ పార్టీలో చేరారు.
5) నారాయణ్రాణె (మహారాష్ట్ర): ఈ కాంగ్రెస్ నేతను మనీలాండరింగ్ కేసులో ఈడీ వేటాడింది. 2017లో బీజేపీకి అనుబంధంగా సొంత పార్టీ పెట్టుకోవడంతో దాడులు ఆగాయి. ఏకంగా కేంద్ర మంత్రి అయ్యారు. చివరికి 2019లో తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు.
6) హిమంత బిశ్వ (అసోం): శారద కుంభకోణంలో నిందితుడు. సీబీఐ 2014 నవంబర్లో ఆయన ఇంటిపై దాడులు చేసింది. 2015 ఆగస్టులో ఆయన బీజేపీలో చేరారు. ఏకంగా అసోం ముఖ్యమంత్రి అయ్యారు.
7) జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్): కాంగ్రెస్కు చెందిన జ్యోతిరాధిత్య సింధియాపై భూ ఆక్రమణ కేసులు నమోదయ్యాయి. 2020 మార్చి 10న ఆయన బీజేపీలో చేరగానే మధ్యప్రదేశ్ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ ఈ కేసును మూసివేసింది.