ORR | ఔటర్ రింగ్ రోడ్పై వాహనాల గరిష్ఠ పరిమితి వేగాన్ని హెచ్ఎండీఏ పెంచింది. ప్రస్తుతం గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు అనుమతి ఉండగా.. దీన్ని 120 కిలోమీటర్లకు పెంచింది. ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వాహనాల గరిష్ఠ పరిమితి వేగాన్ని పెంచేందుకు అనుమతి ఇవ్వగా.. ఈ మేరకు హెచ్ఎండీఏ ఉత్తర్వులు జారీ చేసింది. ఔటర్ రింగ్ రోడ్ ఎనిమిది వరుస యాక్సెస్- నియంత్రిత ఫ్రీవే కాగా.. ప్రతి వైపు నాలుగు వరుసలుంటాయి. ఇప్పటి వరకు మొదటి, రెండు వరుసల్లో గరిష్ఠ పరిమితి వేగం గంటకు 100 కిలోమీటర్ల ఉన్నది.
మూడు, నాలుగో వరుసల్లో గరిష్ఠ పరిమితి వేగం గంటకు 80 కిలోమీటర్లు. మొదటి, రెండు వరుస వేగ పరిమితిని 100 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల వరకు సవరించారు. ఈ సందర్రభంగా భద్రతా నియమాలను పాటించేలా చూడాలని మంత్రి కేటీఆర్ హెచ్ఎండీఏను ఆదేశించారని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్కుమార్ పేర్కొన్నారు. ఓఆర్ఆర్ (కోకాపేట నుంచి ఘట్కేసర్ వరకు, తారామతిపేట – నానక్రామ్గూడ వరకు) ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రయాణికులు 1066, 105910 నంబర్లలో డయల్ చేయాలని హెచ్ఎండీఏ సూచించింది.
పట్టణాల్లో వర్షాకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సంసిద్ధంగా ఉండాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ నగరంపైన ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్ భారీ వర్షాలను, వరదలను దృష్టిలో ఉంచుకొని చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీలో చేపట్టిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమం (SNDP) పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. చేపట్టిన మెజారిటీ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, గత సంవత్సరంతో పోలిస్తే వరద ప్రమాదం అనేక కాలనీలకు తప్పిందని సదరు విభాగం అధికారులు మంత్రికి వివరించారు.
నగరవ్యాప్తంగా ఉన్న చెరువులన్నింటికీ సంబంధించిన నీటి నిల్వ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని, ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల ప్రకారం వాటి నిలువలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. వర్షాకాల ప్రణాళికకు సంబంధించి గత కొంతకాలంగా పురపాలికలు ఏర్పాట్లను చేసుకుంటున్నాయని, జీహెచ్ఎంసీ, రాష్ట్రంలోని ఇతర పురపాలికలు నాళాల సేఫ్టీ ఆడిట్ను పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. లోతట్టు ప్రాంతాల్లో డీవాటరింగ్ పంపులు, ఇతర ఏర్పాట్లతో సన్నద్ధంగా ఉండాలని కేటీఆర్ ఆదేశించారు. పట్టణాల్లో వర్షాకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని, ప్రాణనష్టం జరుగకుండా చూడడమే అధికారుల ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు.