Sircilla | గంభీరావుపేట, మార్చి 21: ఇప్పటికే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ చిన్నారికి అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతు బీమా అందుకోవడంలో మరింత జాప్యమవుతున్నది. తండ్రి మరణించి 25 రోజులైనా మరణ ధ్రువీకరణ పత్రం అందకపోవడంతో ఇబ్బంది పడుతున్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కోళ్లమద్దికి చెందిన ఎనిమిదేండ్ల జాలిగం అర్పిత పుట్టిన కొద్ది రోజులకే తల్లి మరణించగా, గత నెల 26న తండ్రి శంకర్ అనారోగ్యంతో మృతిచెంచాడు. దీంతో ఆ చిన్నారి అనాథగా మారింది. తండ్రి పేరిట ఎకరం వ్యవసాయ భూమి ఉండగా, రూ.5 లక్షల రైతు బీమా మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు అర్పితకు సూచించారు.
మాజీ సర్పంచ్ కేశవరావు చొరవ తీసుకుని గత నెల 27న మరణ ధ్రువీకరణ పత్రం కోసం పంచాయతీ అధికారులకు సమాచారం అందించారు. 25 రోజులైనా మరణ ధ్రువీకరణ పత్రం చేతికి రాకపోవడంతో చిన్నారి అర్పితకు రైతు బీమా మంజూరు కావడంలో జాప్యం జరుగుతున్నది. డెత్ సర్టిఫికెట్ ఇస్తేనే బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. దీంతో చిన్నారి దిక్కుతోచని స్థితిలో పడగా, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు మాజీ సర్పంచ్ తెలిపారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా డిజిటల్ సైన్ కావడంలో ఇబ్బంది తలెత్తడం వల్లే ఆలస్యమవుతున్నదని తెలిపారు.