అనాథలను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసేవారిపై పీడీ యాక్టు
సిగ్నళ్ల వద్ద అనాథలతో బిక్షాటన చేసే వారిని కట్టడి చేసేందుకు స్పెషల్ డ్రైవ్
కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలకు అండగా సర్కారు
అనాథలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్య
అనాథ పిల్లలను రాష్ట్ర బిడ్డలుగా గుర్తిస్తూ ప్రత్యేక స్మార్ట్ కార్డు
హైదరాబాద్ : రాష్ట్రంలోని అనాథ పిల్లలందర్నీ రాష్ట్ర బిడ్డలుగా గుర్తించాలని తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. వీరందరికి రాష్ట్ర ప్రభుత్వమే తల్లీతండ్రి అని స్పష్టం చేసింది. అనాథలకు ప్రభుత్వమే తల్లితండ్రీగా అన్ని తానై ఉండి, దేశం గర్వించే మరో అద్భుత విధానాన్ని తీసుకురావడానికి శ్రీకారం చుట్టింది.
తెలంగాణ రాష్ట్రంలో అనాథలు అనేవారు ఇక ఉండొద్దనే గొప్ప సంకల్పంతో వారిని రాష్ట్ర బిడ్డలుగా పరిగణిస్తూ, వారికి కేజీ నుంచి పీజీ వరకు ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ పెట్టి ప్రత్యేక గురుకులాల్లో నాణ్యమైన విద్య అందించి, జీవితంలో స్థిరపడేలా ఉపాధి కల్పించి, కుటుంబం ఏర్పాటు చేసే విధంగా ఈ చట్టంలో ప్రత్యేక రక్షణలు కల్పించాలని ఈ కమిటీ చర్చించింది. అనాథలపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి నేతృత్వంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ప్రత్యేక ఆహ్వానితులుగా బోయినపల్లి వినోద్ కుమార్ సభ్యులుగా ఉన్న కేబినెట్ సబ్ కమిటీ నేడు హైదరాబాద్లోని, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్లో సమావేశమై చర్చించింది.
కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, మిగిలిన అనాథలందరినీ చూసి సీఎం కేసీఆర్ చలించిపోయారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అనాథలు అనేవారు ఉండకూడదనే సంకల్పంతో కేబినెట్ సబ్ కమిటీ వేసి, దేశం గర్వించే విధంగా వారికోసం సమగ్ర చట్టం చేసేందుకు నివేదిక ఇవ్వాలని కేసీఆర్ కోరిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలో అనాథలకు ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో అన్ని విధాల సాయం అందుతోందని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల ప్రత్యేక కార్యదర్శి, కమిటీ కన్వీనర్ దివ్య దేవరాజన్ తెలిపారు. రాష్ట్రంలో అనాథల కోసం నిర్వహిస్తున్న అనేక అనాథ ఆశ్రమాలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి, వారి సలహాలు, సూచనలు తీసుకున్నామని మంత్రులకు వివరించారు. అనాథల కోసం వచ్చిన ప్రతిపాదనల సమాహారాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు.
అనాథల కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొంతమంది పిల్లలను అడ్డుపెట్టుకుని మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, వారితో సిగ్నళ్ల వద్ద బిక్షాటన చేస్తున్నారని, వీరిపై పీడీ చట్టం పెట్టి భవిష్యత్లో ఇంకెవరు ఇలా చేయకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకునే విధంగా రానున్న నూతన చట్టంలో నిబంధనలు రూపొందించాలని మంత్రులు సూచించారు. సిగ్నళ్ల వద్ద పిల్లలతో భిక్షాటన చేయించే వారిని గుర్తించి, వారికి ప్రభుత్వ హోమ్స్ లలో షెల్టర్ కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు.
అనాథలను ప్రభుత్వ బిడ్డలుగా గుర్తిస్తూ వారికి ప్రత్యేక స్మార్ట్ ఐడీ కార్డులు ఇవ్వాలని, ఈ కార్డు ఉంటే ఇన్ కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ వంటి ఇతర సర్టిఫికేట్ లకు మినహాయింపు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముస్లింలలో అనాథలను చేరదీసే విధంగా యతీమ్ ఖానాలు నిర్వహిస్తున్నారని, వాటిని కూడా ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి అన్ని విధాల వారికి వసతులు కల్పించి అండగా నిలబడాలన్నారు.
ప్రభుత్వ బిడ్డల కోసం చేసే ఖర్చును గ్రీన్ ఛానల్లో పెట్టాలని, దీనికి ఎస్సీ, ఎస్టీ ప్రగతి పద్దుకు ఉన్నట్లు నిధులు ఆ సంవత్సరంలో ఖర్చు కాకపోతే మురిగిపోకుండా వచ్చే సంవత్సరానికి ఉపయోగించుకునే విధానం పెడితే వారికి శాశ్వతంగా ఆర్ధిక భద్రత లభిస్తుందన్నారు. సమాజంలో చాలామంది వ్యక్తులు, వ్యవస్థలు ఇలాంటి పిల్లలకు ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చేందుకు చాలామంది ఉన్నారని, అనాథలకు ఆర్థిక సాయం చేయడం వల్ల టాక్స్ మినహాయింపు వస్తుందన్న విషయం అందరికీ తెలువదని, దీనిని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్నారు. నో చైల్డ్ బిహైండ్ అన్న నినాదంతో అనాథల కోసం కార్పోరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ కింద ముందుకు వచ్చే వారికి తగిన గౌరవం, గుర్తింపు ఇచ్చి వారి సాయం తీసుకోవాలన్నారు.
అనాథలందరికీ ఒక అలుమ్నీ, నెట్ వర్క్ ఏర్పాటు చేయాలని, వారు ఎప్పుడు కూడా అనాథలవలె భావించకుండా ఉండేందుకు ఈ నెట్ వర్క్ పనిచేసేలా చూడాలన్నారు. అనాథలుగా ఉంటూ గొప్ప, గొప్ప స్థాయికి చేరుకున్న వారి విజయగాథలను ఇక్కడ చెబుతూ స్ఫూర్తిని అందించాలన్నారు.