హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఆ చదువుల తల్లి భవిష్యత్తు అంధకారం కాకుండా మనసున్న మంత్రి కేటీఆర్ నేనున్నానని భరోసా ఇచ్చారు. తల్లిదండ్రులు లేని అనాథ రుద్ర రచన. పైగా పేదరికం ఆమెను చదువుల్లో పైకి వెళ్లకుండాఅడ్డుపడబోయింది. ఈ సంగతి తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ముందుకు వచ్చారు. రుద్ర చదువుకయ్యే ఖర్చంతా సొంతంగా భరించారు. నేడు ఆ అమ్మాయి ఇంజినీరింగ్ చదువు పూర్తి చేయడమే కాకుండా ఏకంగా నాలుగు సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికై.. కేటీఆర్ నమ్మకాన్ని నిలబెట్టింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన రుద్ర రచన చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. స్థానిక బాలల సదనంలో ఉంటూ
జగిత్యాల ప్రభుత్వ బాలికల హైస్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నది. ఆ తరువాత హైదరాబాద్ యూసుఫ్గూడలోని స్టేట్ హోమ్లో ఉంటూ పాలిటెక్నిక్ పూర్తిచేసింది.
2019లో ఈసెట్ ద్వారా హైదరాబాద్ సీబీఐటీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో ఇంజినీరింగ్ సీటు సాధించింది. అయితే తల్లిదండ్రులు లేకపోవడం, ఫీజు చెల్లించే స్థోమత లేకపోవడంతో ఏమి చేయాలో అర్థంకాని అయోమయంలో సీబీఐటీలో వచ్చిన సీటును వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో రుద్ర రచన ఆర్థిక ఇబ్బందులను సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్, ఆమెను ప్రగతిభవన్కు పిలిపించుకొని ఇంజినీరింగ్కు అయ్యే ఖర్చులు భరిస్తానని హా మీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రుద్ర రచన ఇంజినీరింగ్ ఫీజులు, హాస్టల్ సంబంధిత ఖర్చులను భరించారు. కేటీఆర్ ఆర్థిక సహాయంతో ఇంజినీరింగ్ పూర్తిచేసిన రుద్ర రచన ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో నాలు గు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలను సాధించిం ది. తన ఇంజినీరింగ్ పూర్తయిన సందర్భంగా సోమవారం రుద్ర రచన ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ను కలుసుకున్నారు. ఆమె చదు వు, ఉద్యోగాల విషయం తెలుసుకొని కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. తనకంటూ ఎవరూ లేకు న్నా ఆత్మవిశ్వాసంతో కష్టపడి రుద్ర రచన జీవితంలో విజయం సాధించిందని కొనియాడారు.
రచన మాటలతో కేటీఆర్ భావోద్వేగం
రచన మాటలకు, అభిమానానికి కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. రచన చేత రాఖీ కట్టించుకున్న తాను, ఆమె జీవితంలో మరింత స్థిరపడేందుకు చేసే ప్రతి ప్రయత్నానికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జీవితంలో అనేక కష్టాలను సవాల్గా స్వీకరించి నాలుగు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన రచన, యువతరానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి సివిల్ సర్వెంట్ కావాలన్న రచన లక్ష్యానికి అండగా ఉంటానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. రచన చివరి సంవత్సరం ఫీజు, హాస్టల్ బకాయిల చెల్లింపునకు అవసరమైన మొత్తం నగదు సహాయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ అందించారు.
వారంలో సిరిసిల్ల విద్యార్థులకు ట్యాబ్లు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు వారం రోజుల్లో ట్యాబ్లను పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తన జన్మదినం సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు బైజు ద్వారా శాంసంగ్ ట్యాబ్లెట్ పంపిణీ చేస్తామని తెలిపారు. హామీని నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు.
అన్నలా అండదండలు అందించారు: రుద్ర రచన
తల్లిదండ్రులు లేని తనకు మంత్రి కేటీఆర్ ఒక అన్నగా అండదండలు అందించారని, తన కల సాకారం కోసం తండ్రిలా తపించారని ఈ సందర్భంగా రుద్ర రచన భావోద్వేగానికి లోనైంది. ఈ సంవత్సరం కేటీఆర్కు రాఖీ కట్టాలని అనుకున్నానని, అయితే ఆయన కాలికి గాయం కారణంగా వెళ్లలేక పోయినందుకు బాధపడ్డానని చెప్పింది. తాను పొదుపు చేసుకున్న కొద్దిపాటి డబ్బుతో వెండి రాఖీని తయారు చేయించిన రుద్ర రచన సోమవారం దాన్ని కేటీఆర్ చేతికి కట్టారు.