హైదరాబాద్ : వృద్ధాప్య పింఛను వయోపరిమితిని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వయోపరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. ఇకపై అర్హులైన 57 ఏండ్ల వాళ్ళందరికీ కొత్త పెన్షన్లు అందనున్నాయి. వెంటనే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
నూతన పింఛన్ల నిర్ణయంపై రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయస్సును 65 ఏండ్ల నుండి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో 36, తేదీ: 04-08-2021 ను విడుదల చేసిందన్నారు. సంబంధిత ప్రక్రియను తక్షణమే ప్రారంభించి, అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు అందించాలని అందులో పేర్కొన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.