హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): ప్రజాసమస్యలపై చర్చించకుండా పారిపోయి.. నిలదీసిన ఎంపీలను సస్పెన్షన్ పేరుతో సభనుంచి బయటకు గెంటేసిన కేంద్రంపై విపక్షం ధిక్కార స్వరాన్ని వినిపించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్లమెంటు లోపలా, బయటా తీవ్రమైన నిరసన ధ్వనిని వినిపించింది. టీఆర్ఎస్ ఎంపీలతోపాటుగా సమస్త విపక్ష సభ్యులు బుధవారం ఉదయం నుంచి పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు ఏకంగా 50 గంటల నిరవధిక నిరసన దీక్ష ప్రారంభించారు. రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన టీఆర్ఎస్ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, దీవకొండ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్రతోపాటు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కొనసాగిస్తున్నారు. ఈ శుక్రవారం వరకు నిరవధికంగా నిరసన తెలపాలని నిర్ణయించారు.
దఫాల వారీగా ఆయా పార్టీల ఎంపీలు దీక్షలో పాల్గొంటున్నారు. ఎంపీలపై సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, తెలంగాణకు వరదసాయం తదితర ప్రజా సమస్యలపై తక్షణమే పార్లమెంట్ ఉభయసభల్లో ప్రత్యేక చర్చకు అనుమతించాలని డిమాండ్ చేశారు. బుధవారం పార్లమెంట్ ఉభయ సభల్లోనూ టీఆర్ఎస్ ఎంపీల పోరాటం కొనసాగింది. ప్లకార్డులు పట్టుకొని కేంద్రం వైఖరిని నిరసించారు. దీంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు నేతృత్వంలో విపక్ష ఎంపీలు అంతకుముందు గాంధీ విగ్రహం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. కేంద్రం వైఖరిని ఎండగడుతూ మోదీ డౌన్డౌన్.. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నామా నాగేశ్వర్రావు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పార్లమెంట్లో చర్చించాలని అడిగినందుకు ఎంపీలను నస్పెండ్ చేయడం అన్యాయమన్నారు.
సస్పెన్షన్ను వెంటనే వెనకి తీసుకోవాలని డిమాండ్చేశారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలపై కేంద్రాన్ని ప్రశ్నించినందుకు సస్పెండ్చేస్తారా? అని నిలదీశారు. నిరసన తెలుపుతున్న ఎంపీలను సస్పెండ్ చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. న్యాయం జరిగేంతవరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి లేదని, అందుకే ప్రజా సమస్యలపై చర్చకు భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనలోఎంపీలు సంతోష్కుమార్, కేఆర్ సురేశ్రెడ్డి, రంజిత్రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, దీవకొండ దామోదర్రావు, కొత్త ప్రభాకర్రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, మన్నే శ్రీనివాసరెడ్డి, పోతుగంటి రాములు, పనుసూరి దయాకర్, మాలోత్ కవిత, బొర్లకుంట వెంకటేశ్ నేత తదితరులతోపాటు ఇతర విపక్షాల ఎంపీలు కూడా పాల్గొన్నారు.
8 రోజులు.. 24 సస్పెన్షన్లు
పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతున్నది. గత ఎనిమిది రోజుల సమావేశాల్లో ఏకంగా 24 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటుపడింది. ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై నినాదాలు చేయడంతో పాటు ఛైర్మన్ కుర్చీ మీదకు కాగితాలు చించి విసిరేశారన్న కారణంతో బుధవారం రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్సింగ్ను ప్యానల్ చైర్మన్ భువనేశ్వర్ కలీతా వారంపాటు సస్పెండ్ చేశారు. విపక్ష సభ్యుల నిరసనలతో భోజన విరామానికి ముందు ఎగువసభ మూడుసార్లు వాయిదాపడింది. ద్రవ్యోల్బణం, జీఎస్టీ, గ్యాస్ ధర పెంపుపై చర్చ జరుపాలని విపక్షాలు పట్టుబట్టడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. లోక్సభలోనూ విపక్ష పార్టీల నిరసనలు కొనసాగాయి. నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియంలోకి దూసుకురాబోమని, సభలో నినాదాలు, ఫ్లకార్డులు ప్రదర్శించబోమని హామీ ఇస్తేనే సస్పెన్షన్ ఎత్తివేతపై యోచిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. కాగా, ఎంపీల సస్పెన్షన్పై రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్యనాయుడును విపక్ష పార్టీ నేతలు బుధవారం కలిశారు. సస్పెన్షన్లను ఉపసంహరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే సభలో ప్రవర్తించిన తీరుపై విచారం వ్యక్తం చేస్తున్నట్టు సస్పెండెడ్ ఎంపీలు లేఖ ఇస్తేనే సస్పెన్షన్ ఎత్తివేతపై యోచిస్తామని వెంకయ్య తేల్చిచెప్పారు. ఇదిలాఉండగా.. కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ప్రతిపక్ష నేతలను వేధించడం, ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ కాంప్లెక్స్ నుంచి విజయ్చౌక్ వరకు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
మా ఎంపీలను సస్పెండ్ చేస్తారా?
కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్ ఫైర్
హైదరాబాద్, జూలై 27(నమస్తే తెలంగాణ): జీఎస్టీ పెంపు, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల వంటి అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు జంకుతున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. ఈ అంశాలపై చర్చించాలన్నందుకు ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ బుధవారం ఓ ట్వీట్ చేశారు. ‘ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిత్యావసరాలపై జీఎస్టీ పెంపు వంటి అంశాలపై చర్చకు అంగీకరించకుండా ముగ్గురు టీఆర్ఎస్ ఎంపీలను రాజ్యసభ నుంచి వారంపాటు సస్పెండ్ చేస్తారా? కేంద్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నది? ప్రతిపక్షాల గొంతు ఎందుకు నొక్కుతున్నది?’ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.