హైదరాబాద్, మార్చి 10 : ఉన్న ఖాళీలకు అదనంగా 5 వేల ఉద్యోగాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు భర్తీ ప్రకటన చేశారని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. బిస్వాల్ కమిటీ రిపోర్టును పట్టుకొని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని తెలిపారు. గురువారం శాసన మండలిలో బడ్జెట్పై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్ సమాధానమిచ్చారు. బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని కాంగ్రెస్ సభ్యుడు జీవన్రెడ్డి చేసిన విమర్శపై మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు.. బిస్వాల్ కమిటీ ఉద్యోగాల భర్తీ కోసం ఏర్పాటు చేసిందని కాదని, ఈ కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఉద్యోగుల గణాంకాలను చూపిస్తూ కొన్ని శాఖలకు సంబంధించిన వర్కింగ్ స్ట్రెన్త్ కాలంలో పొరపాటుగా జీరో అని పెట్టడం వల్ల ఎక్కువ ఖాళీలు ఉన్నట్టు ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. ‘భవిష్యత్తులో ప్రమోషన్లు ఇస్తే ఖాళీలు ఏర్పడుతాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ఖాళీలకు అదనంగా 5 వేల ఉద్యోగాలు కలిపి ప్రకటన చేశారు. నిరుద్యోగులకు సాధ్యమైనంత వరకు మేలు చేయాలన్న మంచి ఉద్దేశమే ఇది. దీనిపైనా ప్రతిపక్షాలు బుదరజల్లే ప్రయత్నం చేస్తున్నాయి’ అని ఫైరయ్యారు. ప్రతిపక్షాలు, కొంత మంది రాజకీయ నాయకులు మిడిమిడి జ్ఞానంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తెలియకపోతే అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు కానీ ప్రజల్లో నవ్వులపాలు కావొద్దని మంత్రి హితవు పలికారు. ఉద్యోగ ఖాళీలపై టీఆర్ఎస్ సర్కారును విమర్శించేవారు ముందు కేంద్రం పరిధిలో ఖాళీగా ఉన్న 15.62 లక్షల ఉద్యోగాలపై ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. రక్షణ శాఖలో 2 లక్షలు, రైల్వేలో 3 లక్షలు, బ్యాంకుల్లో 41 వేల ఖాళీలు ఉన్నాయని తెలిపారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై శ్వేత పత్రం విడుదల చేస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే ఢిల్లీలో కూర్చొని ఖాళీలు భర్తీ చేయించాలని, చిల్లర మల్లరగా మాట్లాడవద్దని హెచ్చరించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల లెక్కన 15 కోట్ల ఉద్యోగాలేవి? అని బీజేపీని నిలదీశారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదా? అని అడిగారు. ప్రతిపక్షాలు కోడి గుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి ధ్వజమెత్తారు.
పసుపు బోర్డు తెస్తానని ఫేక్ బాండ్ రాసిచ్చారు
బీజేపీ నేతలను గ్రామాల్లోకి అడుగుపెట్టనీయకుండా ప్రజలు, రైతులే తరిమికొడుతున్నారని మంత్రి హరీశ్ అన్నారు. ‘పసుపు బోర్డు తెస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి ఓట్లు వేయించుకొన్నారు. ఇప్పుడు వాళ్ల సంగతి ఏమైతున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లదొక ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ, అబద్ధాలు చెప్పడంలో వాళ్లకు మించినోళ్లు ఎవరు ఉండరు. అబద్ధాలలో వాళ్లకు నోబెల్ ప్రైజ్ ఇచ్చినా తక్కువే’ అని మంత్రి దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ఒక్కొక్కటిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బేజార్.. బేజార్ అవుతున్నారని ఎద్దేవా చేశారు.
పదేండ్ల కాంగ్రెస్.. మా ఒక్క ఏడాదికి సరిపోదు
కాంగ్రెస్ ప్రభుత్వం పదేండ్లలో వివిధ వర్గాలకు ఖర్చు చేసిన దాని కంటే ఒక్క ఏడాదిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది ఎక్కువ అని మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఆ పార్టీకి, తమ పార్టీకి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో 2004 2014 మధ్య వ్యవసాయంపై ఖర్చు పెట్టింది రూ.7,994 కోట్లు కాగా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలో ఒక్క రైతు బంధుకే రూ.14,400 కోట్లు ఖర్చు చేస్తున్నదని వెల్లడించారు. ఏడున్నర ఏండ్లలో వ్యవసాయరంగంపై టీఆర్ఎస్ సర్కారు ప్రత్యక్షంగా పెట్టిన ఖర్చు రూ.83,989 కోట్లు అని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ హయాంలో అభయ హస్తం పథకం పెట్టి ఒక్కొక్కరి నుంచి రూ.5 వేలు డిపాజిట్గా కట్టించుకొన్నారని, తాము ఎవరి దగ్గర నయా పైసా తీసుకోకుండా ఆసరా పింఛను ఇస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎల్ఐసి వద్ద డిపాజిట్ చేసిన అభయహస్తం నిధులను విడుదల చేయించి, వడ్డీతో సహా తిరిగి ఎవరి డబ్బులు వారికి చెల్లించబోతున్నామని మంత్రి వివరించారు. కాగా, బడ్జెట్పై చర్చ ముగియడంతో మండలిని ఈ నెల 14కు వాయిదా వేస్తున్నట్టు ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ ప్రకటించారు.