KCR | బీఆర్ఎస్పై కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ను కాంగ్రెస్ సర్కార్ మార్చేసింది. ఏళ్ల తరబడి ప్రతిపక్ష నేతకు ఇస్తున్న కార్యాలయాన్ని కాకుండా చిన్న రూమ్ను కేటాయించింది. మొదటి అసెంబ్లీ సమావేశాల్లో కేటాయించిన ఛాంబర్ను రెండో సమావేశాల్లోపే మార్చేసింది. ఇన్నర్ లాబీలో ఉన్న ప్రతిపక్ష నేత కార్యాలయాన్ని ఇప్పుడు ఔటర్ లాబీలోని చిన్న గదిలోకి మార్చేసింది. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ ఛాంబర్ను మార్చారంటూ అసెంబ్లీ లాబీలో చర్చ జరుగుతోంది.
కాగా.. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష నేతకు చిన్న గదిని కేటాయించడంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే విషయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. గతంలో ఉన్న ప్రతిపక్ష కార్యాలయం కంటే ఇప్పుడు ఇచ్చినది చాలా చిన్నదిగా ఉన్నదని అన్నారు. ప్రతిపక్ష నేతను అవమానించేలా ప్రభుత్వ చర్య ఉందని విమర్శించారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిసి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు.