TTD | హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) ః వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే జంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. కొత్త జంటలకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించింది. పెళ్ళైన వెంటనే తిరుమలకు వచ్చి నూతన వధూవరులు శ్రీవారి కళ్యాణంలో పాల్గొని మొక్కులు తీర్చుకుంటామని మొక్కుకుంటారు. అలాంటి నూతన వధూవరులకు టీటీడీ ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది.
నూతన వధూవరులు తిరుమలకు వచ్చి శ్రీవారి కల్యాణంలో పాల్గొంటే సకల సౌఖ్యాలు, దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందని భక్తుల విశ్వాసం. మరికొందరు ఇరు జంటలు పెళ్లి ద్వారా ఒక్కటయ్యే శుభకార్యం నిర్వఘ్నంగా సాగాలని మొక్కుకుంటారు. అలా పెళ్లి జరిగితే స్వామి వారి కళ్యాణ సేవలో పాల్గొంటారని భక్తులు స్వామి వారికి వేడుకుంటారు. అనంతరం కళ్యాణ సేవలో పాల్గొనాలని తిరుమలకు వస్తారు. అయితే ఎలా టికెట్ పొందాలో ..ఎక్కడికి వెళ్లాలో తెలియదు. నూతన వధూవరుల కోసం టీటీడీ రోజుకు 20 టికెట్లను కేటాయించింది. టికెట్ రూ.1000. ఇందులో కళ్యాణోత్సవం, ప్రత్యేక దర్శనం కలిపే ఉంటాయి. ఈ టికెట్ పొందాలంటే కొన్ని నియమాలు పాటించాలి. పెళ్ళైన కొత్త జంట ముందుగా సీఆర్వో కార్యాలయంలో ఆర్జిత సేవా లక్కీ డిప్ కౌంటర్కి వెళితే చాలు. ఫోటో ఫ్రూఫ్ కింద వధూవరుల పెళ్లి నాటి ఫోటో తప్పని సరి. ఇక లిఖిత పూర్వక ఫ్రూఫ్ కింద వెడ్డింగ్ కార్డు కూడా తప్పనిసరి. పెళ్ళి వారం రోజుల లోపే ఉండాలి. వీటితో పాటుగా ఆధార్ కార్డ్ సైతం తప్పనిసరిగా ఇవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ ద్వారా నూతన వధూవరులు నేరుగా కల్యాణోత్సవ టికెట్ పొందవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు.