హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు తెరుచుకున్నాయి. లబ్ధిదారులకు బుధవారం రేషన్ సరుకులను డీలర్లు పంపిణీ చేశారు. పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం రేషన్ డీలర్ల జేఏసీ నేతలతో జరిపిన చర్యలు సఫలం కావడంతో సాయంత్రం నుంచి రేషన్ సరుకుల పంపిణీ మొదలైంది. 22 సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేషన్ డీలర్లు తొలుత సమ్మెకు పిలుపునిచ్చారు. దాంతో గత నెల 22న రేషన్ డీలర్లతో మంత్రి గంగుల మొదటి దఫా చర్చలు జరిపారు. 20 సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.
మిగిలిన రెండు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. దాంతో రేషన్ డీలర్లు సమ్మె ఆలోచనను విరమించుకున్నారు. మళ్లీ ఈ నెల మూడో తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించారు. రేషన్ డీలర్ల తీరుపై మంత్రి గంగుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలుగొద్దనే ఉద్దేశంతో వారితో మంగళవారం మరోసారి చర్చలు జరిపారు. ప్రభుత్వ లక్ష్యాలను, ఉద్దేశాన్ని కరాఖండిగా రేషన్ డీలర్ల జేఏసీ నేతలకు వెల్లడించారు. దిగొచ్చిన నేతలు మంత్రి గంగుల సమ్మె ఆలోచనను పూర్తిగా విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. సరుకుల పంపిణీని మంగళవారం సాయంత్రం నుంచే మొదలు పెట్టారు.
పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం: గంగుల
మంగళవారం నాటి చర్చలు సఫలం కావడంతో బుధవారం హైదరాబాద్లోని సివిల్సప్లయ్ భవన్లో మంత్రి గంగుల, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్తో అన్ని జిల్లాల డీలర్లు సమావేశమయ్యారు. ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు అడ్డుపడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. పేద ప్రజలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడంలో రేషన్ డీలర్ల పాత్ర మరువలేనిదని అన్నారు. సమ్మె విరమణ ఆలోచన శుభపరిణామమని చెప్పారు. రేషన్ డీలర్ల ప్రధాన డిమాండ్లు అయిన గౌరవ భృతి, కమీషన్ పెంపు విషయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. తమ సమస్యలపై మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వడంతో అన్ని జిల్లాల రేషన్ డీలర్లు సంతోషం వ్యక్తం చేశారు.