హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి రాగానే చేయూత లబ్ధిదారుల పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఆచరణలో విఫలమైంది. రెండేండ్లుగా నిరీక్షిస్తూ ఆశగా ఎదురుచూస్తున్న వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికుల ఆశలపై నీళ్లు చల్లింది. 2026-27 మూడో బడ్జెట్ కేటాయింపుల్లోనూ సగం నిధులే అంటే రూ. 14,861 కోట్లు ప్రతిపాదించింది. 2023-24, 2024-25 బడ్జెట్లోనూ రూ. 14,861 కోట్లు కేటాయించింది. ఈ కేటాయింపులతో మూడో ఏడాది సైతం పింఛన్ల పెంపులేనట్టేనని తేటతెల్లమైంది. రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షల మందికి రూ. 2,016, దివ్యాంగులకు రూ. 3,016 చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఇందుకు ప్రతినెలా రూ. 1,150 కోట్ల వరకు ఖర్చుచేస్తున్నారు.
కొత్త పింఛన్ల మంజూరు లేనట్టే..
ప్రస్తుత బడ్జెట్లో చేయూత పథకానికి కేటాయింపులు పరిశీలిస్తే పింఛన్ల పెంపుతోపాటు కొత్త పింఛన్ల మంజూరు లేనట్టేనని తెలిసిపోతున్నది. రూపాయి కూడా పెంచకపోవడమే ఇందుకు నిదర్శనం. పైగా మరణించినా.. ఇతరత్రా కారణాలతో తొలగించిన లబ్ధిదారుల సొమ్ము సైతం మిగుల్చుకొనే అవకాశం కనిపిస్తున్నది. 2024 ప్రజాపాలన గ్రామసభలతోపాటు వివిధ సందర్భాల్లో నిర్వహించిన గ్రామసభల్లో 25 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. వీరందరూ రెండేండ్లుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. 2018 పీఎఫ్ నిబంధన ఎత్తివేయడంతో 70 వేల మంది బీడీ కార్మికులు పింఛన్ల కోసం దరఖాస్తులు సమర్పించారు. బడ్జెట్లో కేటాయింపు చూస్తే వీరి ఆశలు అడియాశలైనట్టేనని స్పష్టమవుతున్నది. సర్కార్ తీరుపై లబ్ధిదారులు, ఆశావహులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వందరోజుల్లో అమలు హామీని విస్మరించడంపై భగ్గుమంటున్నారు.
వైద్యరంగానికి 13,679 కోట్లు ; నిర్వహణ పద్దు 6,984కోట్లు ప్రగతి పద్దుకు 6,695 కోట్లు
హైదరాబాద్, మార్చి 20(నమస్తే తెలంగాణ): వైద్యారోగ్యశాఖకు ప్ర భుత్వం ఈ ఏడాది రూ.13,769 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దుకు రూ.6,984కోట్లు, ప్రగతి పద్దుకు రూ.6,695 కోట్లు కేటాయించింది. బడ్జెట్లో మెడికల్ కాలేజీల నిర్మాణాల కోసం డీఎంఈ విభాగానికి రూ.3,018.94 కోట్లు కేటాయించింది. ఆరోగ్యశ్రీకి రూ. 1,143 కోట్లు, డిజిటల్ హెల్త్కు రూ.911 కోట్లు కేటాయించారు. ఇక మందుల కొనుగోలుకు కేవలం రూ. 377 కోట్లు కేటాయించారు. రూ. 250 కోట్ల వరకు మందులు సరఫ రా చేసిన ఏజెన్సీలకు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉండగా ఏడాదికి రూ.377 కోట్లు కేటాయించడం గమనార్హం. టిమ్స్లకు రూ. 228 కోట్లే కేటాయిస్తే, అవి పూర్తయ్యదెప్పుడనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు రూ.252కోట్లు కేటాయించారు. రూ. 2,700కోట్లతో నిర్మిస్తున్న ఉ స్మానియాకు సైతం రూ.100 కోట్లు కేటాయిస్తే ఎన్నటికీ పూర్తవుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.