కరీంనగర్ : ఈటల రాజేందర్కు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. కరీంనగర్లో మంత్రి గంగుల మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ ప్రజలు ఈటల వెంట ఎందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయట్లేదు అని ప్రశ్నించారు. కరీంనగర్ను బొందలగడ్డగా మార్చినట్లు తనపై విమర్శలు చేయడం సరికాదు. హుజురాబాద్ నియోజకవర్గంలో గ్రానైట్ పరిశ్రమలు నడుస్తున్నాయి.
మరి మంత్రి పదవి స్వీకరించిన తర్వాత గ్రానైట్ పరిశ్రమలను ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులతో ఈటల కుమ్మక్కైయ్యారా? అని ప్రశ్నించారు. తమిళనాడు వాసులు గ్రానైట్ క్వారీలు నిర్వహిస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదు అని అడిగారు. కరీంనగర్లో 350 గ్రానైట్ క్వారీలు ఉంటే.. గంగుల కమలాకర్కు ఒక్కటే గ్రానైట్ క్వారీ ఉన్నది. ఆ క్వారీ తాను రాజకీయాల్లోకి రాక ముందు నుంచే ఉందన్న విషయం తెలుసుకోవాలని ఈటలకు గంగుల సూచించారు.
పన్నులు ఎగ్గొట్టానని తనపై ఈటల విమర్శలు చేస్తున్నారు. తాను ఎక్కడైనా పన్నులు ఎగ్గొట్టినట్లు నిరూపిస్తే ఐదు రెట్లు అధికంగా చెల్లిస్తానని తేల్చిచెప్పారు. అసైన్డ్ భూముల విషయంలో ఈటలను దోషిగా తేల్చారు. సిగ్గుంటే ఆ భూములను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈటల బెదిరింపులకు ఎవరూ భయపడరు. తాను కూడా బీసీ బిడ్డనే.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు. ఈటల కంటే తనకు ఆత్మగౌరవం ఎక్కువ అని మంత్రి గంగుల పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నందునే ఇన్నాళ్లూ ఈటలను గౌరవించామన్నారు. కార్యకర్తలను ఈటల కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈటల ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.