Women Drivers | హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): దేశంలో అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నా వాహనాలు నడిపే విషయంలో మాత్రం ఇంకా ఎంతో మెరుగుపడాల్సి ఉన్నది. దేశంలోని మహిళల్లో కేవలం 6.8 శాతం మందికే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే ప్రతి వంద మందిలో ఏడుగురికే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నదన్నమాట. ఈ జాబితాలో మణిపూర్ మెరుగ్గా ఉన్నది. అక్కడ ప్రతి వంద మందిలో 27 మందికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నది. గోవాలో ప్రతి 25 మందికి లైసెన్స్ ఉన్నదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేరళలో ప్రతి వంద మంది మహిళలకు 20 మందికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి.
పెరుగుతున్న సంఖ్య
ఏటికేడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్న మహిళల సంఖ్య పెరుగుతున్నది. 2020లో దేశవ్యాప్తంగా దాదాపు కోటి మందికి డ్రైవింగ్ లైసెన్స్లు ఇవ్వగా.. అందులో 15 లక్షల మంది మహిళలు ఉన్నారు. 2022లో ఆ సంఖ్య భారీగా పెరిగింది. కేరళ ప్రభుత్వం 11 లక్షల మందికి లర్నింగ్ లైసెన్స్లు జారీ చేయగా.. ఇందులో 40 శాతం మంది మహిళలే ఉన్నట్టు ఆ రాష్ట్ర రవాణా శాఖ వెల్లడించింది. ఇది దేశంలోనే అత్యధికం. గోవాలో లర్నింగ్ లైసెన్స్ పొందినవారిలో 33 శాతం మంది మహిళలే కాగా, చండీగఢ్ (30 శాతం), పుదుచ్చేరి (29.5 శాతం), లక్షద్వీప్ (25 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అతి తక్కువగా బీహార్లో 3.82 శాతం మంది మాత్రమే లర్నింగ్ లైసెన్స్ పొందారు.
మహిళా డ్రైవర్లే సేఫ్
పురుషులతో పోల్చితే మహిళల డ్రైవింగే సురక్షితమని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అంగీకరిస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు చెప్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2019-22 మధ్య హైవేలపై ప్రమాదాల్లో 14,217 మంది డ్రైవర్లు మరణించారు. ఇందులో 462 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. సర్వేల ప్రకారం.. పురుషుల వేగంతో పోల్చితే మహిళలు 12 శాతం తక్కువ స్పీడ్తో వాహనాలను నడుపుతారట. అత్యధిక ప్రమాదాలు ఓవర్టేక్ చేసే సమయంలోనే జరుగుతుంటాయి. అయితే మహిళలు తక్కువగా ఓవర్టేక్ చేస్తారట. ట్రాఫిక్ ఉల్లంఘనల విషయంలోనూ మహిళల సంఖ్య తక్కువ ఉన్నట్టు రాష్ర్టాల గణాంకాలు చెప్తున్నాయి. ట్రాఫిక్ నిబంధనల ప్రకారమే వారు డ్రైవింగ్ చేస్తారని, అనవసరంగా రిస్క్ తీసుకోవడం ఎందుకని ఆలోచిస్తుంటారని నివేదికలు చెప్తున్నాయి.