(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్(నమస్తే తెలంగాణ): సోలార్ పవర్లో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతున్నదని ప్రధాని మోదీ ప్రచారం చేసుకున్నా.. వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. దేశంలో పెద్దయెత్తున ఆర్భాటంగా స్థాపించిన సౌర మినీ గ్రిడ్లలో కేవలం 5 శాతం మాత్రమే పని చేస్తున్నాయి. 4 వేలకు పైగా ఉన్న బేస్ సోలార్ మినీ గ్రిడ్లలో 3300 ప్రభుత్వ సొమ్ముతో స్థాపించారు. కానీ వాటిలో 95 శాతం పనిచేయటం లేదని, భారతదేశ సోలార్ ప్రాజెక్టులను చూసి ఇతర దేశాలు జాగ్రత్త పడుతున్నాయంటూ.. వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. 94వ మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ 100 శాతం సౌర విద్యుత్తు ఉన్న తొలి గ్రామంగా గుజరాత్లోని మోధేరాను ప్రకటించారు. ప్రభుత్వ ఖర్చుతో ఆ గ్రామంలోని వేయికి పైగా ఇళ్లపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసి 24 గంటల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నామని ప్రకటించారు. కానీ ప్రధాని మోదీ ప్రకటన అవాస్తవమంటూ వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ఇప్పుడా గ్రామం అంధకారంలో మగ్గుతున్నదని పేర్కొంది. 2014లో బీహార్లో మోంగాబే గ్రామాన్ని ఇండియాలో మొదటి సోలార్ విలేజ్గా ప్రభుత్వం ప్రకటించినా, ఆ తర్వాత ఆ గ్రామంలోని సోలార్ పవర్ స్టేషన్ పశువుల దొడ్డిగా మారిందని పేర్కొంది. రామ్ శర్మ అనే వ్యక్తి చేసిన అధ్యయనం ప్రకారం సోలార్ గ్రామాలలో రెండేళ్లు కూడా తిరగకుండానే సగం సోలార్ కనెక్షన్లు ఉపయోగంలో లేకుండా పోవడం వల్ల ప్రజాధనమంతా బూడిదలో పోసిన పన్నీరయ్యిందని పేర్కొంది. జార్ఖండ్లోని మరో సోలార్ గ్రామం బార్బెరాలో, పశ్చిమ బెంగాల్ లోని సుందర్ బన్స్లో గ్రిడ్లు పనిచేయటం లేదని పేర్కొంది. గ్రిడ్లో బ్యాటరీలు మార్చాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆరోపించినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.