Telangana | కమాన్చౌరస్తా, ఏప్రిల్ 10: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కరీంనగర్లోని అలకాపురికాలనీకి చెందిన గణిత ఉపాధ్యాయురాలు రజిత కుంటుంబానికి తోటి టీచర్లు అండగా నిలిచారు. తొమ్మిదేండ్ల క్రితం గుండెపోటుతో తండ్రి మృతి చెందగా, ఇద్దరు బిడ్డలను కంటికి రెప్పలా పెంచుతున్న తల్లి రోడ్డు ప్రమాదంలో దూరమవడంతో వారు అనాథలయ్యారు. రజిత ఇద్దరు కొడుకుల ఉన్నత చదువుకు అండగా ఉండాలని రహీంఖాన్పేట తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు నిర్ణయం తీసుకున్నారు.
తోటి ఉపాధ్యాయురాలి కుటుంబానికి ఆర్థిక భరోసా అందించాలని భావించి చేయి చేయి కలిపి విరాళాలు సేకరించేందుకు సిద్ధమయ్యారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆన్లైన్లో విరాళాలు సేకరించారు. దాదాపు 2500 మంది తమకు తోచినంత పంపగా, శనివారం రాత్రి వరకు ఆ నిధి రూ.17 లక్షలకు చేరింది. ఆ మొత్తాన్ని మంగళవారం రజిత కుమారులు ప్రజ్ఞాన్రెడ్డి, రిషిక్కు అందించనున్నట్టు ఆ ఉపాధ్యాయులు తెలిపారు. విరాళాల సేకరణ ముగిసిందని, ఎవరైనా విరాళాలు ఇవ్వదల్చుకుంటే కుటుంబసభ్యులను సంప్రదించాలని కోరారు.