హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): సోమవారం నుంచి 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్, డిజిటల్ తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన శనివారం ఉత్తర్వులు జారీచేశారు. కరోనా, ఒమిక్రాన్ నేపథ్యంలో ఈ నెల 8 నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తిరిగి 17న ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో కేసుల తీవ్రతతో ఈ నెల 30 వరకు సెలవులను పొడిగించారు. రోజువారీగా కేసులు పెరుగుతుండటంతో విద్యాసంస్థల పునఃప్రారంభంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు నష్టపోకుండా సోమవారం నుంచి టీశాట్, దూరదర్శన్ ద్వారా ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. 50 శాతం బోధన బోధనేతర సిబ్బంది రోటేషన్ పద్ధతిలో విధులకు హాజరయ్యి ఆన్లైన్ తరగతులు పర్యవేక్షించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. విద్యాశాఖ హెచ్వోడీలు, హైదరాబాద్, వరంగల్ ఆర్జేడీలు, డీఈవోలు ఆన్లైన్ తరగతుల నిర్వహణకు చర్యలు చేపట్టాలని సూచించారు.
పరిస్థితులను బట్టి మిగతావారికి..
పరిస్థితులను బట్టి మిగతా తరగతులకు సైతం ఆన్లైన్ క్లాసులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో 1 నుంచి 7 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులపై అధికారులు స్పష్టతనివ్వలేదు. వారంపాటు వేచిచూసి, ఫిబ్రవరి ఒకటి నుంచి వీరికి సైతం ఆన్లైన్ క్లాసులు ప్రారంభించాలని యోచిస్తున్నారు. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ (సైట్) అధికారులను సంప్రదించి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది.
ఆన్లైన్ క్లాసులు 30 వరకు పొడిగింపు
రాష్ట్రంలోని అన్ని రకాల బీటెక్, బీ ఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులను ఈ నెల 30 వరకు పొడిగించారు. ఈ నెల 17 నుంచి 22 వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని జేఎన్టీయూహెచ్ అధికారులు తొలుత ఆదేశించారు. ఈ గడువు శనివారంతో ముగిసింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆదేశాలతో ఆన్లైన్ క్లాసులను ఈ నెల 30 వరకు పొడిగించాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ ఆదేశాలు జారీచేశారు.