మలక్పేట, సెప్టెంబర్ 24: కొంతకాలంగా స్థిరంగా ఉన్న ఉల్లి ధరలు మళ్లీ ఘాటెక్కుతున్నాయి. హైదరాబాద్లోని మలక్పేట వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం కిలో ఉల్లిగడ్డ ధర ఏకంగా ఏడు రూపాయలు పెరిగింది. గ్రేడ్-1 మేలురకం క్వింటాకు రూ.2,700, మోడల్ రకం రూ.1,800, గ్రేడ్-2 మేలు రకం రూ.1,600లు, మోడల్ రకం రూ.1,200 పలికింది. వానల కారణంగా రాష్ట్రంలోని గద్వాల, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ఉల్లి పంట దెబ్బతినడం, ఈనామ్ విధానానికి వ్యతిరేకంగా ఏపీలో జరుగుతున్న ఆందోళనలు, మహారాష్ట్రలో నిల్వలు తగ్గిపోవడం ఇందుకు కారణమని వ్యాపారులు చెప్తున్నారు. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి మలక్పేట మార్కెట్కు గురువారం 13,080 క్వింటాళ్ల ఉల్లి రాగా, శుక్రవారం అది 11,400 క్వింటాళ్లకు పడిపోయింది. ఒక్కరోజు 1,680 క్వింటాళ్ల దిగుమతి తగ్గటంతో ధరలు పెరిగాయని మలక్పేట వ్యవసాయ మార్కెట్ ఉపసంచాలకుడు దామోదర్ తెలిపారు.