సంగారెడ్డి,సెప్టెంబర్ 11 : సింగూరు ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతున్నది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షంతో ప్రాజెక్టులోకి వరద చేరుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి అంతగా వరద తీవ్రత లేదని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 29.293 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ఇన్ ఫ్లో 3288 క్యూసెక్కులుగా కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా, అవుట్ ఫ్లో 3288 క్యూసెక్కులు బయటకు వెళుతున్నట్లు ప్రాజెక్టు డిప్యూటీ డీఈ నాగరాజు తెలిపారు.
కాగా, ప్రతి మూడు గంటలకు ఒకసారి నీటి ప్రవాహం హెచ్చు తగ్గులను గమినిస్తూ అధికారులు ప్రాజెక్టు వద్దే ఉంటున్నారు. ఏక్షణమైనా ఎగువ ప్రాంతం నుంచి వరద తీవ్రత పెరుగొచ్చనే ఆలోచనతో అధికారులు, సిబ్బంది 24 గంటలు ప్రాజెక్టు వద్దే ఉంటూ సందర్శకులను ఎవరిని కూడా ప్రాజెక్టు పైకి అనుమతించడం లేదు. దీంతో సందర్శకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.