భూత్పూర్, జూన్ 23 : ‘సర్’ కార్యక్రమం గురించి బీఆర్ఎస్ కార్యకర్తలు పూర్తిగా తెలుసుకోవాలని, అర్హుల ఓట్లు తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు మండలం అన్నాసాగర్లో మంగళవారం పాతమొల్గర, కప్పెట, లంబాడీకుంటతండా, కొత్తమొల్గర, కరివెన గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలతో సర్పై ఆయన సమీక్షించారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి.. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. గ్రామాలకు కొత్తగా వచ్చిన కోడళ్ల వివరాలు 2002కు సంబంధించినవి ఉండాలని, డబుల్ ఓట్లు లేకుండా చూసుకోవాలని సూచించారు. భూత్పూరు మండలం పాత మొల్గర మాజీ సర్పంచ్ చిన్ని కృష్ణయ్య, శేఖర్ కాంగ్రెస్ పార్టీని వీడి.. బీఆర్ఎస్లో చేరగా గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.