జమ్మికుంట చౌరస్తా, అక్టోబర్ 21: బీజేపీ అంటే బట్టేబాజ్, ఝూటేబాజ్ పార్టీ అని, నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుడు తప్ప, ఒరగబెట్టిందేం లేదని ఆర్థిక మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్, తనుగుల, శంభునిపల్లి, పాపక్కపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం, సాయంత్రం వావిలాలలో ధూంధాం నిర్వహించారు. అభ్యర్థి గెల్లు శ్రీనివాస్తో కలిసి మంత్రి ధూంధాంకు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థి ఈటలకు ఓటమి భయంతో పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము మర్యాదగా మాట్లాడుతుంటే, ఆయన అభ్యంతరకరమైన భాషతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చివరకు ‘రారా.. పోరా..’ అనే స్థితికి తెగబడ్డారని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు ఏం పనులు చేస్తారో చెప్పకుండా, తండ్రిలా ఆదరించిన కేసీఆర్ను, టీఆర్ఎస్ పార్టీని తూలనాడుతూ అసహనపు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరుపేద ఉద్యమకారుడికి సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చి ఆశీర్వదిస్తే, అతన్ని ఓడించేందుకు కేంద్ర మంత్రులతోపాటు రాష్ట్ర బీజేపీ నాయకులంతా ఇక్కడే మకాం వేసి కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఏడేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్చేశారు.
ఈటలను గెలిపించేందుకు బండి సంజయ్, అరవింద్ తిరుగుతున్నారని పేర్కొన్నారు. ‘మీరు తిరుగుతే మాకేం అభ్యంతరం లేదు.. అయితే, మీరు గెలిస్తే ఏం చేస్తరో చెప్పాలి’.. అని ప్రశ్నించారు. కేంద్రం పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గిస్తారా? అని నిలదీశారు. నిజామాబాద్లో అరవింద్ పార్లమెంట్ ఎన్నికలప్పుడు గెలిచిన మూడు నెలల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి, మూడేండ్లయినా చెయ్యక మొండి చెయ్యి చూపారని, అలాంటి వ్యక్తి మాటలు ఇక్కడ చెల్లుతాయా? అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తిని పట్టుకొని తిరుగుతున్న ఈటల కూడా అలాంటి వాడేనని ఎద్దేవాచేశారు. చేసిన అవినీతి అంతా చేసి, ఇప్పుడు సానుభూతి మాటలు మాట్లాడుతున్నారని, తనకు అంటిన బురదను ఇక్కడి ప్రజలకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారని చురకలంటించారు.
ఉగాదికి లక్ష రుణ మాఫీ
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రైతులకు రూ.50 వేల వరకు పంట రుణాల మాఫీ ప్రక్రియ పూర్తయ్యిందని, ఉగాదికి కొంచెం అటూ ఇటుగా రూ.లక్ష రుణ మాఫీని మొత్తం పూర్తిచేస్తామని హరీశ్రావు హామీ ఇచ్చారు. రైతన్నలకు భారం కాకుండా వడ్డీ సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో ఇప్పటికే వ్యవసాయ విద్యుత్తు మోటర్లకు మీటర్లు బిగించే పని మొదలైందని గుర్తుచేశారు. మన దగ్గర మాత్రం సీఎం కేసీఆర్ ‘నా ప్రాణం ఉన్నంతవరకు రైతన్నకు ఉచిత విద్యుత్తు ఇచ్చుడే, ఇక్కడ మీటర్లు పెట్టేందుకు ఒప్పుకునేది లేదు’ అని కరాఖండిగా చెప్పారని వివరించారు. వావిలాలను మండలం చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయని, ఎన్నికల కోడ్ ముగియగానే ముఖ్యమంత్రి కాళ్లు మొక్కైనా వావిలాలను మండలంగా చేస్తానని ప్రకటించారు. ఇందులో చేరడం ఇష్టం లేని గ్రామాలను వదిలేస్తామని కూడా చెప్పారు. గెల్లును గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా పంపించాలని కోరారు. శ్రీనివాస్ గెలిస్తే నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో గెల్లుకు ఉన్న సాన్నిహిత్యంతో నిధులు పెద్ద మొత్తంలో తెచ్చి, అభివృద్ధి పనులు చకచకా పూర్తి చేస్తారని తెలిపారు.
ఇప్పటికే రైతులకు రూ.50 వేల వరకు పంట రుణాల మాఫీ ప్రక్రియ పూర్తయ్యింది. ఉగాదికి కొంచెం అటూ ఇటుగా రూ.లక్ష రుణ మాఫీని మొత్తం పూర్తిచేస్తాం. రైతన్నలకు భారం కాకుండా వడ్డీ సైతం
రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.