టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం నేతగా అయతుల్లా ఖమేనీ కుమారుడు మోజ్తాబా హుసేన్ ఖమేనీ(Mojtaba Hosseini Khamenei) ఎన్నికయ్యారు. ఇజ్రాయిలీ మీడియా ఈ విషయాన్ని పేర్కొన్నది. ఇరాన్కు చెందిన నిపుణుల అసెంబ్లీ మోజ్తాబాను ఎన్నుకున్నది. అయతుల్లా అలీ ఖమేనీ వారుసుడిగా మోజ్తాబా కొనసాగనున్నారు. 36 ఏళ్ల పాటు ఇరాన్ సుప్రీం నేతగా కొనసాగిన ఖమేనీ.. గత శనివారం అమెరికా-ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనువరాలు మృతిచెందారు. గాయపడ్డ ఖమేనీ భార్య మన్సౌరీ ఖోజసేత్ భగేర్జదే రెండు రోజుల తర్వాత ప్రాణాలు విడిచింది.
మొజ్తాబా వయసు 56 ఏళ్లు. తన తండ్రి ఖమేనీ అడుగుజాడల్లో రాజకీయ, మతపరమైన వ్యవస్థలను ఆయన నడిచారు. 1969లో మషాద్లో మోజ్తాబా జన్మించారు. అలీ ఖమేనీ రెండో కుమారుడు ఆయన. ఆయనకు అయిదుగురు సోదరులు ఉన్నారు. టెహ్రాన్లో ఉన్న అలావి ఉన్నత పాఠశాలలో ఆయన చదువుకున్నారు. ఆ తర్వాత ఖోమ్లో మోజ్తాబా మతపరమైన విద్య నేర్చుకున్నారు. మతపరమైన శిక్షణలో ఆయన చాన్నాళ్లుగా కొనసాగుతున్నా.. అయతుల్లా ర్యాంక్కు మాత్రం ఇంకా చేరుకోలేదు. ఇరాన్-ఇరాక్ మధ్య యుద్ధం సమయంలో.. హబిబ్ బెటాలియన్లో మోజ్తాబా విధులు నిర్వర్తించారు. ఇరాన్ సెక్యూర్టీ, ఇంటెలిజెన్స్లో ఉన్న ప్రముఖులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి.