శిశు మరణాల రేటు ఇంకా తగ్గాలి
సిజేరియన్లు మరో 20% తగ్గించాలి
రక్తం నిల్వ ఉంచుకోవాలి
వైద్యాధికారులకు వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు దిశానిర్దేశం
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో ఏడాదికి కనీసం లక్ష క్యాటరాక్ట్ ఆపరేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఏడాదికి 4 లక్షల క్యాటరాక్ట్ ఆపరేషన్లు జరుగుతుంటే వాటిలో కేవలం 25వేలు మాత్రమే ప్రభుత్వ వైద్యశాలల్లో జరుగుతున్నాయని అన్నారు. ఇకపై వైద్యవిధాన పరిషత్ దవాఖానల్లో లక్ష ఆపరేషన్లు జరిగేలా లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలని సూచించారు. టీవీవీ, మాతాశిశుకేంద్రాల పనితీరు తదితర అంశాలపై వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్రావు బుధవారం సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ వారం వారం ప్రతీ పీహెచ్సీలో కంటి పరీక్షలు నిర్వహించి ఏరియా దవాఖానలకు ఆ రోగులను పంపేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వోలు సమన్వయం చేసి క్యాటరాక్ట్ ఆపరేషన్లు పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 97 శాతం నుంచి 99.9శాతానికి పెరిగాయని చెప్పారు. శిశు మరణాల శాతం 23 నుంచి 21శాతానికి తగ్గిందని, 2014కు ముందు 39శాతం ఉండేదని తెలిపారు. సిజేరియన్ ఆపరేషన్లు 61 శాతం నుంచి 58 శాతానికి తగ్గించగలిగామని మరో 20శాతం తగ్గించాలని చెప్పారు. డాక్టర్లు, ఇతర సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దని, అందరు బాగానే పనిచేస్తున్నా కొందరి నిర్లక్ష్యం వల్ల వైద్యారోగ్యశాఖ అంతటికీ చెడ్డపేరు వస్తున్నదని అన్నారు. కుటుంబసభ్యులను ఎలా చూసుకుంటామో మన వద్దకు వచ్చే రోగులను కూడా అలానే ప్రేమతో చూసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ చికిత్సలు పెరగాలని, ఓపీని పెంచాలని సూచించారు. ప్రభుత్వ వైద్యం పట్ల రోగుల్లో విశ్వాసం పెంచేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఆశ కార్యకర్తలు రాత్రిపూట ఉండేలా దవాఖానల్లో రెస్ట్ రూం, ఇతర అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని, సూపరింటెండెంట్లందరూ ఆ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. లాంగ్బోన్ సర్జరీలు పెరగాలని, ఎన్సీడీ స్రీనింగ్ వేగంగా చేయాలని, డయాలిసిస్ పేషెంట్లకు ఇబ్బంది లేకుండా సేవలు అందించాలని చెప్పారు.
ప్రభుత్వ బ్లడ్బ్యాంకుల్లో 25 శాతం బ్లడ్ తకువ ఉన్నదని, సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే ఈ సమస్య ఎదురవుతున్నదని అన్నారు. అన్ని దవాఖానల్లో బ్లడ్ సెపరేటర్లు వాడాలని, పేషెంట్లకు అవసరమైన బ్లడ్ను ఇవ్వడానికి ఇవి ఉపయోగపడతాయని సూచించారు. ఇక దవాఖానల్లో పారిశుద్ధ్యం విషయంలో మార్పు రావాల్సిందేనని స్పష్టం చేశారు. హెచ్ఎంఐఎస్ లో సమాచారం అప్లోడ్ చేసే విషయంలో అలసత్వం వహించవద్దని హెచ్చరించారు. సమీక్షలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, కమిషనర్-ఫ్యామిలీ వెల్ఫేర్ శ్వేతామహంతి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీవీవీ కమిషనర్ అజయ్ కూమార్, డీఎంఈ రమేశ్రెడ్డి, డీహెచ్ శ్రీనివాస్రావు, టీవీవీ వైద్యశాలల సూపరింటెండెంట్లు, డాక్టర్లు, డీసీహెచ్లు తదితరులు పాల్గొన్నారు.