చౌటుప్పల్: యాదాద్రి (Yadadri) భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలంలోని లింగోజిగూడెం వద్ద హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై (National Highway 65) వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (DCM) అదుపుతప్పి ఆర్టీసీ బస్సును వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి డీసీఎం క్యాబిన్ నుజ్జునుజ్జయింది. క్యాబిన్లోనే డ్రైవర్, క్లీనర్ ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్, క్లీనర్లను సుమారు రెండు గంటల పాటు శ్రమించి బయటికి తీశారు. ఇద్దరిని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో క్లీనర్ మృతి చెందాడు. డ్రైవర్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. మృతుడిని ఆంధ్రప్రదేశ్లోని ఏలూరుకు (Eluru) చెందిన బాలకృష్ణగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.